Delhi High Court: జైల్లోనే సీఎం అరవింద్ కేజ్రీవాల్.. పిటిషన్‌ను కొట్టివేసిన ఢిల్లీ హైకోర్టు

  • ఈడీ రిమాండ్‌ను చట్టవిరుద్ధంగా పరిగణించలేమని కోర్టు వ్యాఖ్య
  • ఏప్రిల్ 15 వరకు తీహార్ జైలులోనే ఉండనున్న ఢిల్లీ సీఎం
  • సుప్రీంకోర్టును ఆశ్రయించనున్న అరవింద్ కేజ్రీవాల్
Arvind Kejriwal to approach Supreme Court after Delhi HC dismisses his plea against arrest in liquor scam case

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ప్రస్తుతం తీహార్ జైలులో ఉన్న సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు మరోసారి నిరాశే ఎదురైంది. ఈ కేసులో తన అరెస్ట్‌ను సవాలు చేస్తూ ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు మంగళవారం కొట్టివేసింది. సీఎంని ఈడీ అరెస్టు చేయడం నిబంధనలకు విరుద్ధం కాదని వ్యాఖ్యానించింది. ఈ కేసులో అరెస్ట్ అనంతరం తనను ఈడీ కస్టడీకి అప్పగించడాన్ని హైకోర్టు సమర్థించింది. అరెస్ట్ అనంతరం ఈడీ రిమాండ్‌కు ఇవ్వడాన్ని చట్టవిరుద్ధంగా పరిగణించలేమని తేల్చిచెప్పింది. కాగా ఢిల్లీ హైకోర్టులో చుక్కెదరవ్వడంతో కేజ్రీవాల్ సుప్రీంకోర్టును ఆశ్రయించనున్నారు.

మరోవైపు కేజ్రీవాల్‌ను కస్టడీకి ఇవ్వాలని ఈడీ కోరకపోయినప్పటికీ.. కేసులో కీలక వ్యక్తి కావడంతో ఆయనకు బెయిల్ ఇవ్వొద్దని వాదించింది. విచారణలో సహకరించారని ఈ సందర్భంగా ఢిల్లీ హైకోర్టుకు ఈడీ తెలిపింది.

కాగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరవింద్ కేజ్రీవాల్ కీలక వ్యక్తి అని ఈడీ పేర్కొనడంతో రౌస్ అవెన్యూ కోర్టు కేజ్రీవాల్‌కు బెయిల్ నిరాకరించింది.  ఏప్రిల్ 15 వరకు రిమాండ్ విధించింది. దీంతో ఆయన ప్రస్తుతం తీహార్ జైలులో ఉన్నారు. ఇక ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను మార్చి 21న ఈడీ అరెస్ట్ చేసింది. మద్యం పాలసీని రూపొందించడంలో కేజ్రీవాల్ కీలక పాత్ర పోషించారనేందుకు తమవద్ద ఆధారాలు ఉన్నాయని ఈడీ చెబుతోంది.

More Telugu News