Revanth Reddy: కుట్రలు, కుతంత్రాలను కొడంగల్ ప్రజలు తిప్పికొడతారు: సీఎం రేవంత్ రెడ్డి

  • కొడంగల్‌లో నేతలతో రేవంత్ రెడ్డి సమావేశం
  • ఎన్నికల్లో అందరూ కలిసి కట్టుగా పని చేయాలని సూచన
  • కొడంగల్ ఆత్మగౌరాన్ని దెబ్బతీయాలని చూస్తున్నారని ఆగ్రహం
CM Revanth Reddy meeting in kodangal

మనపై ఎవరు కుట్రలు, కుతంత్రాలు చేసినా... అలాంటి వారిని కొడంగల్ ప్రజలు తిప్పికొట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. రేవంత్ రెడ్డి సోమవారం తన నివాసంలో మండలాల వారీగా పార్టీ నేతలతో సమావేశమయ్యారు. 8 మండలాలకు చెందిన సమన్వయ కమిటీ నేతలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... ఎన్నికల్లో అందరూ కలిసి కట్టుగా పని చేయాలని సూచించారు.

నరేంద్ర మోదీ పదేళ్లుగా ప్రధానిగా ఉన్నప్పటికీ చేసిందేమీ లేదన్నారు. డీకే అరుణ బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలిగా ప్రజలకు ఏం చేశారు? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీలో ఆమె అన్ని పదవులు అనుభవించి... పార్టీ నుంచి వెళ్లిపోయారని మండిపడ్డారు. వంశీచంద్ రెడ్డిని 50వేల మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఆయన ఢిల్లీ నుంచి నిధులు తీసుకువచ్చి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తారన్నారు.

కొడంగల్ ఆత్మగౌరాన్ని దెబ్బతీయాలని చూస్తున్నారన్నారు. కానీ కొడంగల్‌ను అభివృద్ధిలో ముందు ఉంచుతానన్నారు. లోక్ సభ ఎన్నికల్లో మనల్ని దెబ్బతీయడానికి కుట్రలు చేస్తున్నారన్నారు. కొందరు కంకణం కట్టుకొని మన పార్టీ అభ్యర్థిని ఓడించడం ద్వారా తననూ ఓడించాలని చూస్తున్నారన్నారు. 30వేల మందికి ఉద్యోగాలు ఇచ్చినందుకు కాంగ్రెస్ పార్టీని ఓడించాలా? అని సీఎం ప్రశ్నించారు.

More Telugu News