YS Sharmila: షర్మిల యాత్రలో జగన్ ను ఆకాశానికెత్తిన ఓ యువకుడు... కౌంటర్ ఇచ్చిన షర్మిల

  • కడప జిల్లాలో షర్మిల బస్సు యాత్ర
  • దువ్వూరులో షర్మిల ప్రసంగిస్తుండగా జై జగన్ నినాదాలు
  • దమ్ముంటే ఇక్కడికి వచ్చి మాట్లాడాలన్న షర్మిల
  • ముందుకొచ్చి జగన్ గురించి మాట్లాడిన ఓబుల్ రెడ్డి అనే యువకుడు
  • జగన్ అమలు చేయని హామీలను ఏకరవుపెట్టిన షర్మిల
Sharmila counters Jagan supporter

ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కడప జిల్లాలో బస్సు యాత్ర కొనసాగిస్తున్నారు. ఇవాళ దువ్వూరులో ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. షర్మిల ప్రసంగిస్తుండగా, జగన్ వీరాభిమానులు కొందరు నినాదాలు చేశారు. 

జై జగన్ అంటున్న వారిలో నుంచి ఒక యువకుడ్ని పిలిచిన షర్మిల... దమ్ముంటే ఇక్కడికి వచ్చి మాట్లాడండి అంటూ అతడికి మైక్ అందించారు. జగన్ కు ఎందుకు ఓటెయ్యాలో చెప్పండి అని అన్నారు. 

మైక్ దొరకడమే ఆలస్యం... ఓబుల్ రెడ్డి అనే ఆ యువకుడు నమస్తే అక్కా అంటూ ఉపన్యాసం మొదలుపెట్టి జగన్ ను ఆకాశానికెత్తేశాడు. పార్టీ పెట్టినప్పటి నుంచి జగన్ ప్రజల కోసం తిరుగుతూనే ఉన్నాడని, ప్రజల కోసం వచ్చాడని, సమస్యలు విన్నాడని, నేనున్నానని చెప్పాడని పొగడ్తలు జల్లు కురిపించాడు. 

జగన్ చెప్పినవాటిల్లో ప్రతి ఒక్కటీ చేశాడని కొనియాడాడు. 3 వేల కిలోమీటర్ల పాదయాత్ర చేసి మీకు న్యాయం చేస్తానని చెప్పాడని, మాట నిలబెట్టుకున్నాడని ఓబుల్ రెడ్డి అనే ఆ యువకుడు వేనోళ్ల కీర్తించాడు. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరి కుటుంబానికి సంక్షేమం అందింది... అందుకు కారణం జగన్ మోహన్ రెడ్డిగారే అని పేర్కొన్నాడు. 

అనంతరం, మైక్ తీసుకున్న షర్మిల జగన్ వీరాభిమానులకు అదిరిపోయే కౌంటర్ ఇచ్చారు. "చెప్పినవన్నీ చేశారా జగన్? గతంలో నేను కూడా జగన్ కోసం పాదయాత్ర చేసినదాన్నే. జగనన్నకు ఓటేయండి... బీజేపీ వాళ్ల మెడలు వంచి ప్రత్యేక హోదా తీసుకువస్తాడు అని చెప్పిన దాన్ని నేను. తెచ్చాడా ప్రత్యేకహోదా? 

అదే జగన్ మోహన్ రెడ్డి గారు ఈ మాట కూడా చెప్పమన్నారు... అమ్మా, మద్యపాన నిషేధం చేస్తామని చెప్పు అంటే... జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే పూర్తి మద్యపాన నిషేధం జరుగుతుందని ప్రతి అక్కకు, ప్రతి చెల్లికి మాట ఇచ్చిన దాన్ని నేను. 

ఇవాళ అదే జగన్ మోహన్ రెడ్డి పూర్తి మద్య నిషేధం చేయకపోగా, ప్రభుత్వమే, అంటే జగన్ మోహన్ రెడ్డే ఇవాళ మద్యం అమ్ముతున్నారు. ఆ మద్యం కూడా బయటి బ్రాండ్లు కాదు, సర్కారు ఏది అమ్మితే అదే కొనాలి, ఎంతకు అమ్మితే అంతకు కొనాలి. ఈ నాసిరకం మద్యం తాగి ఏపీలో 25 శాతం మంది కిడ్నీలు, లివర్లు పాడై ప్రాణాలు పోగొట్టుకున్నా జగన్ మోహన్ రెడ్డి పట్టించుకోవడంలేదు. 

జగన్ మోహన్ రెడ్డి వాగ్దానాలు ఎక్కడ నెరవేర్చారంటే... అదిగో అక్కడ లిక్కర్ షాపులో... క్యాపిటల్ అంట, స్పెషల్ స్టేటస్ అంట, బూమ్ బూమ్ అంట, డీఎస్సీ అంట... ఇలా హామీలన్నీ మద్యం షాపులో నెరవేరుస్తున్నారు మీ జగనన్న గారు! ఇందుకేనా ఓట్లు వేసింది? దీనికోసమేనా జగనన్నను గెలిపించింది?" అంటూ షర్మిల నిలదీశారు.

More Telugu News