Manne Krishank: ఫోన్ ట్యాపింగ్ అవసరమని మన్మోహన్ సింగే చెప్పారు: బీఆర్ఎస్ నేత క్రిశాంక్ ఆసక్తికర వ్యాఖ్యలు

  • అప్పుడు మన్మోహన్‌ను బద్నాం చేశారా? ఇప్పుడు రేవంత్ రెడ్డి కేసులు ఎందుకు పెట్టిస్తున్నారు? అని ప్రశ్న
  • మన్మోహన్ మీద కూడా విచారణ చేయాలి కదా అని నిలదీత
  • కేసీఆర్‌ను తిట్టేందుకు కాంగ్రెస్ రూ.100 కోట్లతో తుక్కుగూడలో సభ పెట్టిందన్న క్రిశాంక్
Manne Krishankt interesting comments on Phone tapping

ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ మన్నె క్రిశాంక్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సోనియా గాంధీ యూపీఏ చైర్ పర్సన్‌గా, రాహుల్ గాంధీ ఎంపీగా ఉన్నప్పుడు... అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ ఫోన్ ట్యాపింగ్‌పై ఓ స్టేట్‌మెంట్ ఇచ్చారని గుర్తు చేశారు. ఫోన్ ట్యాపింగ్ అవసరమని నాటి ప్రధానే స్వయంగా చెప్పారన్నారు. మరి అప్పుడు మన్మోహన్‌ను బద్నాం చేశారా? అని ఆయన ప్రశ్నించారు. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి కేసులు ఎందుకు పెట్టిస్తున్నారు? అని ప్రశ్నించారు. అప్పుడు ఎంపీగా ఉన్న రాహుల్ గాంధీకి సోయి లేదా? అని నిలదీశారు. మన్మోహన్ మీద కూడా విచారణ చేయాలి కదా అన్నారు.

ఫోన్ ట్యాపింగ్ విష‌యాల‌ను బ‌య‌ట‌పెట్ట‌లేమ‌ని ట్రాయ్ ఢిల్లీ హైకోర్టుకు తెలిపిందన్నారు. ఫోన్లు ట్యాపింగ్ జ‌రిగాయా? లేదా? అన్న‌ది ట్రాయ్‌ని అడగండి... ఈ కేసులో ట్రాయ్, టెలికాం ప్రొవైడ‌ర్ల‌ు ఎందుకు లేరని ప్రశ్నించారు. ఎందుకంటే ఇక్కడ కొందరిని కాపాడే ప్ర‌య‌త్నం చేస్తున్న‌ట్లుగా అనుమానం వస్తోందన్నారు. కానీ ఏది నిజ‌మో తెలియ‌డం లేద‌న్నారు. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్‌ను వెబ్ సిరీస్‌గా నడిపిస్తోందన్నారు. ప్రధాని మోదీ ఈడీ పేరుతో హింసిస్తుంటే... ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపక్షాలపై బురదజల్లి ఓట్లు కొల్లగొట్టే ప్రయత్నం చేస్తోందన్నారు. 10 లక్షల కన్వర్జేషన్లను ట్యాపింగ్ చేశారని, ఇందుకు వార్ రూమ్స్ ఏర్పాటు చేసినట్లు ఆరోపిస్తున్నారని, వాటిపై నిష్పక్షపాత విచారణ జరగాలని డిమాండ్ చేశారు. 

తమ పార్టీ అధినేత కేసీఆర్‌ను తిట్టేందుకు కాంగ్రెస్ రూ.100 కోట్లు ఖ‌ర్చు పెట్టింద‌ని విమర్శించారు. రూ.100 కోట్ల‌తో తుక్కుగూడ‌లో నిర్వ‌హించిన కాంగ్రెస్ స‌భ అజెండా ఏమిటంటే... కేవ‌లం కేసీఆర్‌ను తిట్ట‌డ‌మే అన్నారు. కేసీఆర్ అంటే రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డిలు భ‌య‌ప‌డుతున్నారని, ఇక రాహుల్ గాంధీ మ‌ళ్లీ రాసిచ్చిన స్క్రిప్టునే చదివారని ఎద్దేవా చేశారు. వ‌రంగ‌ల్ డిక్ల‌రేష‌న్‌లో ప్ర‌క‌టించిన రూ.500 బోన‌స్, రైతుకు రూ.15 వేల ఆర్థిక‌సాయం వంటి హామీల‌ను అమ‌లు చేయాలని డిమాండ్ చేశారు. హామీలు మరిచిన రాహుల్ గాంధీ తుక్కుగూడ సభలో ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు చేసిందన్నారు. రైతు ఆత్మ‌హ‌త్య‌లు, ఎండిన పంట‌ల అంశాన్ని, రైతుల డిమాండ్ల‌ను ప‌క్క‌దారి పట్టించేందుకు ఈ ఫోన్ ట్యాపింగ్ వ్య‌వ‌హారాన్ని తెర‌పైకి తీసుకువచ్చారని ఆరోపించారు.

More Telugu News