Chandrababu: సత్తెనపల్లిలో చంద్రబాబును కలిసిన దివ్యాంగులు... రూ.6 వేల పెన్షన్ ఇస్తామన్న టీడీపీ అధినేత

Chandrababu assures disabled persons Rs 6000 pension
  • దివ్యాంగులకు నెలకు రూ.6 వేల పెన్షన్ ఇచ్చేందుకు హామీ ఇచ్చానన్న చంద్రబాబు
  • దివ్యాంగుల సమస్యలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నామని వెల్లడి
  • దివ్యాంగుల కోసం తెచ్చిన పథకాలను వైసీపీ ప్రభుత్వం రద్దు చేసిందని ఆరోపణ 
టీడీపీ అధినేత చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో దివ్యాంగులు తనను కలిసి తమ సమస్యలపై వినతిపత్రం అందజేశారని వెల్లడించారు. వారి కోరికపై... టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దివ్యాంగులకు నెలకు రూ.6 వేల పింఛను ఇచ్చేందుకు హామీ ఇచ్చానని తెలిపారు. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న దివ్యాంగుల సమస్యలను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నామని చంద్రబాబు స్పష్టం చేశారు. 

మొదటి నుంచి దివ్యాంగుల సంక్షేమానికి, ఆత్మగౌరవానికి ప్రాధాన్యత ఇచ్చింది టీడీపీయేనని పేర్కొన్నారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ప్రతి ఏడాది విభిన్న ప్రతిభావంతుల దినోత్సవాన్ని నిర్వహించి, వారిలోని ప్రతిభను గుర్తించేలా చేశామని చంద్రబాబు వివరించారు. 

దివ్యాంగుల కోసం టీడీపీ అమలు చేసిన ప్రత్యేక పథకాలను వైసీపీ ప్రభుత్వం రద్దు చేసిందని ఆరోపించారు. కూటమి అధికారంలోకి వచ్చాక దివ్యాంగుల సంక్షేమానికి మరింత ప్రాధాన్యత ఇస్తామని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.
Chandrababu
Pension
Disabled Persons
TDP
TDP-JanaSena-BJP Alliance
Andhra Pradesh

More Telugu News