Janasena Leader: టికెట్ దక్కకపోవడంతో జనసేనకు పోతిన మహేశ్ గుడ్ బై

  • పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తూ జనసేనానికి లేఖ
  • విజయవాడ వెస్ట్ సీటు ఆశించి భంగపడ్డ పోతిన
  • పవన్ కల్యాణ్ స్వయంగా నచ్చచెప్పినా వినిపించుకోని వైనం
Potina Mahesh Resignation To Janasena

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని భావించినా పార్టీ టికెట్ ఇవ్వకపోవడంతో జనసేన నేత పోతిన మహేశ్ ఆ పార్టీకి రాజీనామా చేశారు. విజయవాడ వెస్ట్ సీటు దక్కకపోవడంతో పార్టీపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ విషయంలో జనసేనాని పవన్ కల్యాణ్ నచ్చచెప్పినా పోతిన వినిపించుకోలేదు. ఈ క్రమంలోనే పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. పవన్ కల్యాణ్ కు తాజాగా తన రాజీనామా లేఖను పంపించారు. దీనిపై పోతిన మీడియాతో మాట్లాడుతూ.. పార్టీ టికెట్ కోసం ఎదురు చూసి చూసి విసిగిపోయానని చెప్పారు. టికెట్ రాదని తేలిపోవడంతో జనసేనలో కొనసాగడంలో అర్థంలేదని భావించి రాజీనామా చేసినట్లు తెలిపారు.

తన అనుచరులతో సంప్రదించి భవిష్యత్ కార్యాచరణను నిర్ణయించుకుంటానని పేర్కొన్నారు. వేరే పార్టీలో చేరతారా లేక ఇండిపెండెంట్ గా బరిలో నిలబడతారా అనే విషయంపై పోతిన మహేశ్ స్పష్టత ఇవ్వలేదు. ఒకటి రెండు రోజుల్లో పూర్తి వివరాలు వెల్లడిస్తానని ఆయన పేర్కొన్నారు. కాగా, ఎన్నికలు సమీపిస్తుండడంతో ఏపీలో ఫిరాయింపులు ఊపందుకున్నాయి. టికెట్ దక్కని నేతలు పక్క పార్టీల వైపు చూస్తున్నారు. టికెట్ ఇచ్చే హామీతో పార్టీలు మారుతున్నారు.

More Telugu News