Dalitha Bandhu: కాగితాల్లోనే దళితబంధు.. డబ్బులు ఇవ్వలేదని కాంగ్రెస్ ఆరోపణ

  • లబ్దిదారులను ఎంపిక చేసి పెండింగ్ లో పెట్టారని వివరణ
  • బీఆర్ఎస్ హయాంలో చివరి రెండేళ్లు పైసా కూడా రిలీజ్ చేయలేదని విమర్శ 
  • వాస్తవాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలంటూ కాంగ్రెస్ కార్యకర్తలకు రేవంత్ సూచన
Dalitha Bandhu Scheem Stopped by KCR In His Term Congress party Clarification

గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన దళితబంధు స్కీం గురించి మాజీ సీఎం కేసీఆర్ ఇప్పుడు అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. బీఆర్ఎస్ ప్రభుత్వం చివరి రెండేళ్లు దళితబంధు లబ్దిదారులకు పైసా కూడా ఇవ్వలేదని వివరించింది. ఆర్భాటంగా లబ్దిదారులను ఎంపిక చేసిన అప్పటి ప్రభుత్వం నిధుల విడుదలను మాత్రం పెండింగ్ లో పెట్టిందని చెప్పింది. ఇటీవల మాజీ సీఎం కేసీఆర్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేసిన విషయం తెలిసిందే. తమ ప్రభుత్వం తీసుకొచ్చిన దళితబంధు సహా పలు పథకాలను కాంగ్రెస్ సర్కారు ఆపేసిందని కేసీఆర్ విమర్శించారు. అయితే, ఈ ఆరోపణలలో వాస్తవంలేదని, ఆయా స్కీంలను బీఆర్ఎస్ ప్రభుత్వమే పెండింగ్ లో పెట్టిందని కాంగ్రెస్ వివరణ ఇచ్చింది. పేరుకే బడ్జెట్ లో నిధులు కేటాయించిందని, నిధులు మాత్రం రిలీజ్ చేయలేదని బీఆర్ఎస్ ప్రభుత్వంపై మండిపడింది.

మాజీ సీఎం కేసీఆర్ ఆరోపణల్లో వాస్తవం లేదనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని మంత్రులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించినట్టు తెలిసింది. గత ప్రభుత్వం ఏయే స్కీంలు ఎంత ఆలస్యం చేసిందనే వివరాలను ఆయా శాఖలవారీగా ప్రజలకు వెల్లడించాలని సీఎం సూచించారు. 2022-23లో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం దళితబంధు స్కీంలో భాగంగా 1500 మంది లబ్ధిదారులకు రూ.17,700 కోట్లు కేటాయించింది. 2023-24 బడ్జెట్లోనూ అంతే కేటాయించింది. రెండేళ్లకు సంబంధించి మొత్తం రూ.35 వేల కోట్లు లబ్దిదారులకు ఇవ్వాల్సి ఉండగా.. ఒక్క లబ్దిదారుడికి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని అధికారులు వివరించారు. దీంతో దాదాపు రూ.35 వేల కోట్ల నిధులు కొలాప్స్ అయ్యాయని చెప్పారు. బతుకమ్మ చీరలకు సంబంధించి సుమారు 488.38 కోట్లు బకాయిలను కూడా చెల్లించలేదని ఆరోపించారు.

More Telugu News