K Kavitha: కవితకు తీవ్ర నిరాశ.. బెయిల్ నిరాకరించిన కోర్టు

  • మార్చి 26వ తేదీ నుంచి తీహార్ జైల్లో ఉన్న కవిత
  • కుమారుడి పరీక్షల నేపథ్యంలో బెయిల్ ఇవ్వాలని కోర్టును కోరిన కవిత
  • కవిత బెయిల్ పిటిషన్ ను కొట్టివేసిన కోర్టు
Delhi Court refuses to give bail to Kavitha

ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో నిందితురాలిగా ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు తీవ్ర నిరాశ ఎదురయింది. కవితకు మధ్యంతర బెయిల్ ఇచ్చేందుకు ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు నిరాకరించింది. ఆమె బెయిల్ పిటిషన్ ను కొట్టివేసింది. తన చిన్న కుమారుడికి పరీక్షలు ఉన్న నేపథ్యంలో... తనకు బెయిల్ మంజూరు చేయాలని కోర్టును కవిత కోరారు. అయితే, కవిత బెయిల్ పై బయటకు వెళ్తే సాక్షులను ప్రభావితం చేస్తారని కోర్టులో ఈడీ వాదనలు వినిపించింది. ఇప్పటికే కొందరిని కవిత బెదిరించిందని కోర్టుకు తెలిపింది. ఈడీ వాదనలతో ఏకీభవించిన కోర్టు... కవిత బెయిల్ పిటిషన్ ను తిరస్కరించింది. 

లిక్కర్ కేసులో కవితను మార్చి 15వ తేదీన ఈడీ అరెస్ట్ చేసింది. తొలుత ఈడీ కస్టడీలో ఉన్న కవితకు కోర్టు జ్యూడీషియల్ రిమాండ్ విధించింది. ఈ క్రమంలో, మార్చి 26వ తేదీ నుంచి ఆమె తీహార్ జైల్లో ఉంటున్నారు. రేపటితో ఆమె జ్యుడీషియల్ రిమాండ్ ముగియబోతోంది. ఆమె జ్యుడీషియల్ రిమాండ్ ను కోర్టు పొడిగించే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి.

More Telugu News