Odisha: భార్య యూట్యూబ్ ఛానల్ మానిటైజేషన్ కోసం ప్రభుత్వ టీచర్ దారుణం

  • ఒడిశాలో కలకలం రేపుతున్న ఘటన
  • 1 నుంచి 8వ తరగతి ప్రశ్నపత్రాలను భార్య యూట్యూబ్ ఛానల్‌లో పెట్టిన టీచర్
  • విషయం అధికారుల దృష్టికి వెళ్లడంతో నిందితుడి అరెస్టు 
  • భార్యను కూడా కుట్రలో పాత్రధారిగా చేర్చిన పోలీసులు
To monetize wifes YouTube channel Odisha teacher uploads questions before exam

తన భార్య యూట్యూబ్ ఛానల్‌కు మానిటైజేషన్ రావాలనే ఉద్దేశంతో ఓ ప్రభుత్వ టీచర్ దారుణానికి ఒడిగట్టాడు. 1 నుంచి 8 వ తరగతి వార్షిక పరీక్ష ప్రశ్న పత్రాలను భార్య యూట్యూబ్ ఛానల్లో అప్‌లోడ్ చేశాడు. విషయం పైఅధికారుల దృష్టికి వెళ్లడంతో చివరకు పోలీసులు అతడిని అరెస్టు తెచ్చారు. ఒడిశాలోని జజ్‌పూర్ జిల్లాలో ఈ ఘటన వెలుగు చూసింది. నిందితుడిని జగన్నాథ్ కార్‌‌గా (29) గుర్తించారు.

జిల్లాల్లోని గోపీనాథ్ జ్యూ నోడల్ స్కూల్‌లో జగన్నాథ్ కార్ అసిస్టెంట్ టీచర్‌గా పనిచేస్తున్నట్టు ఒడిశా స్కూల్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ అథారిటీ ప్రాజెక్టు డైరెక్టర్ తెలిపారు. 1 నుంచి 8వ తరగతి వరకూ ప్రశ్న పత్రాలు లీక్ అయినట్టు తొలుత తమకు సమాచారం అందిందని సదరు అధికారి తెలిపారు. విచారణ సందర్భంగా కార్ పేరు వెలుగులోకి వచ్చిందన్నారు. 

పరీక్షలకు దాదాపు వారం రోజుల ముందు మార్చి 9న నిందితుడు క్లస్టర్ రీసెర్చ్ కోఆర్డినేటర్ నుంచి ఇటారా ప్రైమరీ స్కూల్ ప్రిన్సిపాల్ తరుపున ప్రశ్నపత్రాలు తీసుకున్నాడని తెలిపారు. వాటిని నేరుగా స్కూలుకు తీసుకెళ్లకుండా ఇంటికి తీసుకొచ్చి ఫోన్‌తో ఫొటోలు తీసి తన భార్య యూట్యూబ్ ఛానల్‌లో అప్‌లోడ్ చేశాడని తెలిపారు. ఫలితంగా వారి ఛానల్ సబ్‌స్క్రైబర్ల సంఖ్య ఒక్కసారిగా 5 వేల నుంచి 30 వేలకు చేరుకుందని అన్నారు. ఈ నేపథ్యంలో యూట్యూబ్ ద్వారా నిందితులు ఎంత డబ్బు సంపాదించారో తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. ఈ కేసులో పోలీసులు ప్రభుత్వ టీచర్ భార్య పేరును కూడా కుట్రదారుగా చేర్చారు. అయితే, ఆమె పసిబిడ్డ తల్లి కావడంతో ఇంకా అదుపులోకి తీసుకోలేదని తెలుస్తోంది.

More Telugu News