Revanth Reddy: బిడ్డా కేసీఆర్... నేను జానారెడ్డిని కాదు, రేవంత్ రెడ్డిని.. జైల్లో చిప్పకూడు తినిపిస్తా!: సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర హెచ్చరిక

  • ఏది పడితే అది మాట్లాడితే ఊరుకునేది లేదన్న రేవంత్ రెడ్డి
  • కూతురు జైలుకు వెళ్లిందని, కేసీఆర్‌కు కాలు విరిగిందని ఇప్పటి వరకు ఓపిక పట్టామని వ్యాఖ్య
  • కేసీఆర్ కుటుంబానికి జైల్లో డబుల్ బెడ్రూం ఇల్లు కట్టిస్తానన్న ముఖ్యమంత్రి
  • వెంట్రుక కూడా పీకలేడు అంటావా? మా కార్యకర్తలు తలుచుకుంటే ఒంటి మీద నూలుపోగు ఉండదని హెచ్చరిక
CM Revanth Reddy warning to KCR

బిడ్డా కేసీఆర్, ఏది పడితే అది మాట్లాడితే ఊరుకోవడానికి నేను జానారెడ్డిని కాదు... రేవంత్ రెడ్డిని, ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే చర్లపల్లి జైల్లో చిప్పకూడు తినిపిస్తా...  అంటూ మాజీ సీఎం కేసీఆర్ ను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో హెచ్చరించారు. 

తుక్కుగూడ 'జన జాతర' సభలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ... కూతురు జైలుకు వెళ్లిందని, కేసీఆర్‌కు కాలు విరిగిందని ఇప్పటి వరకు ఓపిక పట్టాం... కానీ ఇక ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఊరుకోబోం అని స్పష్టం చేశారు. కేసీఆర్ కుటుంబానికి జైల్లో డబుల్ బెడ్రూం ఇల్లు కట్టిస్తానని వ్యంగ్యం ప్రదర్శించారు.

వెంట్రుక కూడా పీకలేడు అంటావా... ఇవేం మాటలు.. కాంగ్రెస్ కార్యకర్తలు తలుచుకుంటే మీ ఒంటిమీద నూలుపోగు ఉండదని హెచ్చరించారు. నోటికి వచ్చినట్లు మాట్లాడితే ఖబడ్దార్ అన్నారు. ఆ మధ్య కొన్ని కుక్కలు మొరిగాయి... ఇప్పుడు ఓ నక్క బయలుదేరిందని ఎద్దేవా చేశారు. 

కేసీఆర్‌కు తాను ఓ సవాల్ విసురుతున్నానని... డబుల్ బెడ్రూంలు కట్టించిన చోట బీఆర్ఎస్ వాళ్లు ఓట్లు అడగాలని, ఇందిరమ్మ ఇళ్ళు ఉన్నచోట తాము ఓట్లు అడుగుతామన్నారు. కేసీఆర్ తన పదేళ్ల పాలనలో ప్రజలను పీడించారని ఆరోపించారు. పదేళ్లు దోచుకొని రాష్ట్రాన్ని నాశనం చేశారని, ఈ పదేళ్ల కాలంలోనే వందేళ్ల విధ్వంసం చేశారని ధ్వజమెత్తారు. భాష గురించి మాట్లాడే కేసీఆర్ భాషనే సరిగా లేదన్నారు. 

మనకు 14 ఎంపీ సీట్లు వస్తే కేంద్రం నుంచి నిధులు వస్తాయన్నారు. బీఆర్ఎస్‌ను తొక్కిన ఉత్సాహంతో బీజేపీని తొక్కేయాలని పిలుపునిచ్చారు. గంటకో డ్రెస్ మార్చే మోదీ కావాలా? ప్రజల కోసం ఎండలో తిరిగిన రాహుల్ గాంధీ కావాలా? అని ప్రశ్నించారు. 

వంద రోజుల పాలన మీ ముందు ఉన్నది... ఇచ్చిన హామీలు చిత్తశుద్ధితో అమలు చేస్తున్నామన్నారు. 100 రోజుల పాలన నచ్చితే కాంగ్రెస్‌కు తెలంగాణలో 14 సీట్లు ఇచ్చి గెలిపించాలని కోరారు. ఇవి కేవలం ఎన్నికలు మాత్రమే కాదని... దేశాన్ని రక్షించే ప్రయత్నమన్నారు.

More Telugu News