Rahul Gandhi: తుక్కుగూడలో 'న్యాయపత్రం' పేరుతో మేనిఫెస్టో విడుదల చేసిన రాహుల్ గాంధీ... ఐదు న్యాయసూత్రాలివే...!

  • యువతకు ఏడాదికి రూ.1 లక్ష వచ్చేలా ఉపాధి కల్పిస్తామని హామీ
  • నారీ న్యాయ్‌లో భాగంగా పేదింటి మహిళకు రూ.1 లక్ష ఇస్తామన్న రాహుల్ గాంధీ
  • కిసాన్ న్యాయ్‌లో భాగంగా స్వామినాథన్ ఫార్ములా ప్రకారం మద్దతు ధర ఇస్తామని హామీ
  • కార్మికులకు కనీస దినసరి వేతనం రూ.400 ఉండేలా చూస్తామన్న కాంగ్రెస్ అగ్రనేత
  • తొంబై శాతం దళిత, ఎస్సీ, ఎస్టీలకు న్యాయం చేస్తామన్న రాహుల్ గాంధీ
Rahul Gandhi released Nyaya Patra in Telugu

తుక్కుగూడ 'జన జాతర' బహిరంగ సభలో ఏఐసీసీ అగ్రనాయకుడు రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ జాతీయ మేనిఫెస్టోను విడుదల చేశారు. 'న్యాయపత్రం' పేరుతో విడుదల చేసిన ఈ మేనిఫెస్టోలో ఐదు గ్యారెంటీలు ఇచ్చారు. ఐదు న్యాయసూత్రాల్లో... యువతకు శిక్షణ, మహిళల కోసం నారీ న్యాయ్, రైతుల కోసం కిసాన్ న్యాయ్, కార్మిక్ న్యాయ్, తొంబై శాతం ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీలకు సమన్యాయం అందిస్తామన్నారు.

అసెంబ్లీ ఎన్నికల సమయంలో రాష్ట్రానికి సంబంధించిన గ్యారెంటీల మేనిఫెస్టోను విడుదల చేశామని, ఇప్పుడు జాతీయ మేనిఫెస్టోను విడుదల చేస్తున్నట్లు చెప్పారు. కొన్ని రోజుల క్రితం ఇక్కడి నుంచే ఆరు గ్యారెంటీలు ఇచ్చి... వాటిని అమలు చేస్తున్నామన్నారు. ఎన్నికలకు ముందు ఏ గ్యారెంటీని లేదా ఏ హామీని అయితే ఇచ్చామో... ఆ మాట నిలబెట్టుకున్నట్లుగా తెలంగాణ ప్రజలందరికీ తెలుసునన్నారు. తెలంగాణలో హామీలను నెరవేర్చినట్లు, జాతీయస్థాయిలో కూడా నిలబెట్టుకుంటామన్నారు. నిరుద్యోగులకు ఉద్యోగ హామీలు ఇస్తున్నట్లు చెప్పారు. ఈ మేనిఫెస్టో కాంగ్రెస్ గొంతు అనుకోవద్దని... ఇది యావత్ భారత దేశం యొక్క గొంతు అన్నారు. మేనిఫెస్టోలోను ఐదు న్యాయసూత్రాలు ఐదు భారతీయ ఆత్మలు అన్నారు.

ఐదు న్యాయసూత్రాలలో మొదటిది... యువతకు శిక్షణ కార్యక్రమాలు చేపట్టనున్నట్లు చెప్పారు. దేశవ్యాప్తంగా నిరుద్యోగులకు ఏడాదికి రూ.1 లక్ష వచ్చేలా చేస్తాం. నెలకు రూ.8,500తో ఏడాదిపాటు శిక్షణ ఇచ్చి ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. తమ మేనిఫెస్టోలో యువతకు అధిక ప్రాధాన్యత ఇచ్చినట్లు చెప్పారు.

మహిళల కోసం నారీన్యాయ్ చట్టం తీసుకు వస్తామన్నారు. తాము ఏం చేయగలమో అదే మేనిఫెస్టోలో పెట్టామన్నారు. పేదింటి మహిళకు ఏడాదికి రూ.1 లక్ష సాయమందిస్తామన్నారు. నేరుగా మహిళల ఖాతాల్లో వీటిని జమ చేస్తామన్నారు. తద్వారా ఒక్క కుటుంబానికి కూడా సంవత్సర ఆదాయం రూ.1 లక్ష కంటే తక్కువ ఉండకుండా చూస్తామన్నారు. నారీ న్యాయ్‌తో దేశ ముఖచిత్రం మారబోతుందన్నారు.

మూడోది కిసాన్ న్యాయ్ అని... దీంతో రైతులకు పూర్తి న్యాయం చేస్తామన్నారు. రైతులు పండించే ఉత్పత్తులకు మద్దతు ధర చట్టబద్ధం చేస్తామన్నారు. స్వామినాథన్ ఫార్ములా ప్రకారం మద్దతు ధర ఇస్తామన్నారు.

నాలుగోది కార్మిక్ న్యాయ్ అని రాహుల్ గాంధీ ప్రకటించారు. కార్మికులకు కనీస వేతనం రోజుకు రూ.400 ఉండేలా చూస్తామన్నారు. ఉపాధి హామీ కూలీలకూ వేతనం పెంచుతామన్నారు.

ఐదో హామీగా... తొంభై శాతం ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీ వంటి వెనుకబడిన వర్గాలకు న్యాయం చేస్తామన్నారు. దేశవ్యాప్తంగా ఉన్న అత్యంత ధనికుల్లో దళితులు, ఆదివాసీలు కనిపించరని ఆవేదన వ్యక్తం చేశారు. ఐఏఎస్ సహా అన్ని వర్గాల్లో దళితులు, గిరిజనులకు అన్యాయం జరుగుతోందన్నారు. తాము కులగణన చేయబోతున్నట్లు చెప్పారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు తగిన ప్రాధాన్యత కల్పిస్తామన్నారు. ఆర్థిక సర్వే కూడా చేయిస్తామన్నారు. ప్రజల హక్కులను తాము అమలు చేయబోతున్నట్లు చెప్పారు.

More Telugu News