YS Jagan: నేను అడిగితే చంద్రబాబు సమాధానం చెప్పడంలేదు... మీకు చెబుతాడేమో!: సీఎం జగన్

  • నెల్లూరు జిల్లా కావలిలో సీఎం జగన్ మేమంతా సిద్ధం సభ
  • చంద్రబాబుపై తీవ్ర విమర్శలు గుప్పించిన సీఎం జగన్
  • చంద్రబాబు పేరు చెబితే గుర్తుకువచ్చే పథకం ఒక్కటీ లేదని ఎద్దేవా 
  • అబద్ధాలు, మోసం, కుట్రలు కలిపితే చంద్రబాబు అని వ్యాఖ్యలు
CM Jagan speech in Memantha Siddham rally held at Kavali

ఏపీ సీఎం జగన్ నేడు మేమంతా సిద్ధం 9వ రోజు యాత్ర కొనసాగిస్తున్నారు. నెల్లూరు జిల్లా కావలి బైపాస్ వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభకు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం జగన్ ప్రసంగిస్తూ, విపక్ష నేత చంద్రబాబును లక్ష్యంగా చేసుకుని విమర్శనాస్త్రాలు సంధించారు. చంద్రబాబు పేరు చెబితే గుర్తుకువచ్చే పథకం ఒక్కటీ లేదని అన్నారు. అబద్ధాలు, మోసం, కుట్రలు కలిపితే చంద్రబాబు అని అభివర్ణించారు. ఎన్నికల మేనిఫెస్టో అంటూ గతంలో రంగురంగుల కాగితాలు ఇచ్చాడని, వాటిలో ఎన్ని అమలు చేశాడో చెప్పే ధైర్యం చంద్రబాబుకు ఉందా? అని నిలదీశారు. 

"ఎన్నికలు అయిపోయాక ఎప్పుడైనా నాలాగా, ఇవిగో నేను మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు, ఇవిగో నేను నెరవేర్చిన హామీలు అని చెప్పగలరా అని నేను చంద్రబాబును అడిగితే, ఆయన సమాధానం చెప్పడంలేదు. మీకేమైనా సమాధానం చెబుతాడేమో అడిగి చూడండి. 

14 ఏళ్లు ముఖ్యమంత్రిగా చేశానంటున్నావు... మేనిఫెస్టోలో చెప్పినదాంట్లో ఒక్కటైనా చేశాను అని పబ్లిక్ గా చెప్పే కార్యక్రమం ఒక్కసారైనా చేశావా? చంద్రబాబు ఎన్నికల ముందే మేనిఫెస్టో చూపిస్తాడు, ఎన్నికలు అయిపోయాక మాత్రం మేనిఫెస్టో చూపించడు. నాకైతే చూపించలేదు... పోనీ మీకైనా చూపించాడా? కనీసం మేనిఫెస్టో కాపీనైనా చూపించే దమ్ము, ధైర్యం, నిబద్ధత నీకుందా చంద్రబాబూ? అని అడగుతున్నా. 

చంద్రబాబును మరో ప్రశ్న కూడా అడిగా. మూడు సార్లు ముఖ్యమంత్రి అని చెప్పుకుంటావు... 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా చేశానంటావు... గ్రామాల్లో కానీ, పేదల గుండెల్లో కానీ, సామాజికవర్గాల్లో కానీ, అభివృద్ధిలో కానీ, పేదలకు మంచి చేయడంలో కానీ నిజంగా మీ మార్క్ అంటూ ఉంటే, మూడు పార్టీలు పొత్తు పెట్టుకోవడం ఎందుకయ్యా చంద్రబాబూ? అని అడుగుతున్నా. నాకైతే చంద్రబాబు సమాధానం ఇవ్వడంలేదు, మీకేమైనా ఇచ్చాడా? ఇవ్వడు గాక ఇవ్వడు. 

ఇదే పెద్ద మనిషి చంద్రబాబును మరో ప్రశ్న కూడా అడిగా. వెన్నుపోటు పొడిచో, తడిగుడ్డతో గొంతు కోయడం ద్వారానో, కుట్రలు, కుతంత్రాలు తోనో, నీ ఎల్లో మీడియాతో ప్రచారం చేయించుకునో, 30 ఏళ్ల కిందట  ఏదో విధంగా ముఖ్యమంత్రివి అయ్యావు. ఇప్పటికీ కూడా, జనం ముందుకు వచ్చినప్పుడు నేను గతంలో ఈ మంచి పని చేశాను అని ఒక్కసారి కూడా చెప్పుకోకుండా, నేను ఇంటికి కేజీ బంగారం ఇస్తాను, ఇంటికో బెంజి కారు కొనిస్తాను, సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ అని ప్రజలను మభ్యపెట్టేందుకు ప్రయత్నిస్తుంటావు... పేదల గుండెల్లో గుడి కట్టుకునేలా ఈ పథకం చేశాను అని ఏనాటికైనా చెప్పుకోగలవా? అని అడిగాను. 

దీనికైనా సమాధానం చెబుతాడా అంటే  దీనికీ చెప్పడు. పోనీ నాకు సమాధానం చెప్పకపోయినా, మీకైనా సమాధానం చెప్పాడా? అని అడుగుతున్నా. చెప్పలేదు అనడం కంటే చెప్పలేడు అనడమే కరెక్ట్. ఎందుకంటే.... ప్రజలతోనూ, పేదలతోనూ చంద్రబాబుది అతకని బంధం. చంద్రబాబు నోటికి ఫెవికాల్ వేసుకుంటాడు, ఫెవిక్విక్ పూసుకుని నోరు మూసుకుంటాడు. 

మరి మీ బిడ్డ, మీ జగన్ సిద్ధం సిద్ధం అని సభలు పెట్టి ఏం చెబుతున్నాడంటే... ఇంటింటికీ మంచి చేస్తూ ఏకంగా రూ.2.70 లక్షల కోట్లు నేరుగా అక్కచెల్లెమ్మల ఖాతాల్లోకి, వివిధ పథకాల ద్వారా నగదు బదిలీ చేస్తున్నాడు. ఇదంతా చేసింది 58 నెలల పాలనలోనే. అది కూడా తొలిసారిగా పాలన చేపట్టాక చేసిన అభివృద్ధి ఇది. ఇవాళ మీ బిడ్డ మీ ముందు గొప్పగా నిలబడి, మేనిఫెస్టోను ఒక భగవద్గీత, బైబిల్, ఖురాన్ గా భావించి ఏకంగా 99 శాతం హామీలను నెరవేర్చి మీ ఆశీస్సులు కోరుతున్నాడు. 

ఇంటింటికీ పౌర సేవలను డోర్ డెలివరీ చేయిస్తున్నాడు మీ బిడ్డ. మీ జగన్ లంచాలు లేని, వివక్ష లేని వ్యవస్థ తీసుకువచ్చాడు. వైసీపీకి ఓటు వేయని వారికి కూడా మంచి చేసే వ్యవస్థ తీసుకువచ్చాం. గ్రామాల్లో పాఠశాలలు, ఆసుపత్రులు మార్చాడు మీ జగన్, వ్యవసాయాన్ని మార్చాడు మీ జగన్. అవ్వాతాతల ఆర్థిక సాధికారత ఇదీ అంటూ మీ బిడ్డ జగన్ చేసి చూపించాడు. 

మరి 14 ఏళ్లు చంద్రబాబు ముఖ్యమంత్రిగా చేశాడు... జగన్ చేసిన దాంట్లో కనీసం 10 శాతం అయినా నేను చేశాను అని ఇదీ చంద్రబాబు గుండెలపై చేయి వేసుకుని ధైర్యంగా చెప్పగలడా? 

ప్రతి గ్రామానికి ఏడు వ్యవస్థలు తీసుకువచ్చాం. సచివాలయ వ్యవస్థ, వాలంటీరు వ్యవస్థ, ఆర్బీకే (రైతు భరోసా కేంద్రం) వ్యవస్థ, విలేజ్ క్లినిక్ వ్యవస్థ, ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లీషు మీడియా, నాడు-నేడు, ప్రతి గ్రామంలో ఓ మహిళా పోలీస్, అక్కచెల్లెమ్మల ఫోన్లలో దిశా యాప్, గ్రామాల్లో డిజిటల్ లైబ్రరీ, ఓ లంచాలు లేని, వివక్ష లేని పాలనతో గ్రామ స్వరూపాన్నే మార్చానని ధైర్యంగా చెబుతున్నాడు మీ బిడ్డ జగన్. 

కుప్పం నుంచి ఇచ్ఛాపురం వరకు ఏ గ్రామమైనా తీసుకోండి... నేను చెప్పే ప్రతి మాట ప్రతి గ్రామంలో కనిపిస్తుంది. ప్రతి కుటుంబానికి, ప్రతి గడపకు ఏం చేశానో ధైర్యంగా మీ ముందు నిలుచుని చెప్పగలుగుతున్నాడు మీ బిడ్డ. 

మీకు మంచి జరిగితే మీ బిడ్డకు మీరే తోడుగా ఉండండి అని అడగ్గలుగుతున్నాడు మీ బిడ్డ. మీరు వేసే ఓటు ఎమ్మెల్యేలను, ఎంపీలను ఎన్నుకునే ఓటు కాదు, మీరు వేసే ఓటుతో వచ్చే ఐదేళ్లలో మీ తలరాతలు మారుతాయి" అంటూ సీఎం జగన్ తన ప్రసంగంలో పేర్కొన్నారు.

More Telugu News