Jupally Krishna Rao: కేసీఆర్ ధ‌నిక రాష్ట్రాన్ని రూ. 8 ల‌క్ష‌ల కోట్ల అప్పుల్లోకి నెట్టారు: మంత్రి జూపల్లి

  • సొంత ప్రాంతాన్ని అన్యాయం చేసిన కేసీఆర్‌ను పాతి పెట్టాల‌న్న కాంగ్రెస్ నేత‌
  • కేసీఆర్‌కు ద‌మ్ముంటే మేడిగ‌డ్డ కాదు.. పాల‌మూరుకు పోదామ‌ని స‌వాల్‌
  • గులాబీ బాస్ త‌ల‌కిందులుగా త‌పస్సు చేసినా లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో ఒక్క సీటు గెల‌వ‌లేర‌ని ఎద్దేవా
Minister Jupally Krishna rao Fire on KCR

బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌పై మంత్రి జూప‌ల్లి కృష్ణారావు ఘాటు విమ‌ర్శ‌లు చేశారు. శ‌నివారం ఆయ‌న మంత్రులు ఉత్త‌మ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్ర‌భాక‌ర్‌తో క‌లిసి గాంధీభ‌వ‌న్‌లో మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్ చ‌వ‌ట‌, ద‌ద్దమ్మ కాక‌పోతే ధ‌నిక రాష్ట్రాన్నిరూ. 8 ల‌క్ష‌ల కోట్ల అప్పుల్లోకి నెట్టార‌ని ధ్వ‌జ‌మెత్తారు. ప్రాంతీయుడు త‌న ప్రాంతానికి అన్యాయం చేస్తే అదే ప్రాంతంలోనే పాతి పెట్టాల‌నే సామెత ప్ర‌కారం కేసీఆర్‌ను పాతి పెట్టాల‌న్నారు.

త‌న ప‌దేళ్ల పాల‌న‌లో ఎప్పుడైనా కేసీఆర్ పంట న‌ష్టం ఇచ్చారా అని మంత్రి మండిప‌డ్డారు. ఫామ్ హౌస్‌లో ఉండి ప్ర‌భుత్వాన్ని న‌డిపిన కేసీఆర్‌.. ఇప్పుడు నాలుగు నెల‌ల కాంగ్రెస్ పాల‌న‌ను చూసి ఒర్వ‌లేక‌పోతున్నార‌ని అన్నారు. కేసీఆర్‌కు ద‌మ్ముంటే మేడిగ‌డ్డ కాదు.. పాల‌మూరుకు పోదామ‌న్నారు. మిష‌న్ భగీర‌థ‌లో వేల కోట్ల స్కాం జ‌రిగింద‌ని దుయ్య‌బ‌ట్టారు. 

సీఎం రేవంత్ రెడ్డి ప‌న్నెండు సార్లు ఢిల్లీకి వెళ్లొచ్చినా.. సోనియా, ఖ‌ర్గే అపాయింట్‌మెంట్ ఇచ్చారు. కానీ, కేసీఆర్ హైద‌రాబాద్‌లో ఉన్నా మంత్రుల‌ను క‌ల‌వ‌లేద‌ని జూప‌ల్లి ఫైర్ అయ్యారు. గులాబీ బాస్ త‌ల‌కిందులుగా త‌పస్సు చేసినా లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో ఒక్క సీటు గెల‌వ‌లేర‌ని ఎద్దేవా చేశారు. ఆయ‌న వ్య‌వ‌హారాల‌న్ని తాము ప‌క్క‌న ఉండి చూశామ‌ని, ఇక‌పై రాష్ట్ర ప్ర‌జ‌లు ఆయ‌న‌ను న‌మ్మ‌ర‌ని మంత్రి జూప‌ల్లి చెప్పుకొచ్చారు.

More Telugu News