Indian billionaires under 30: యువ బిలియనీర్లుగా భారతీయ సోదరులు.. వారి నెట్ వ‌ర్త్ ఎంతో తెలిస్తే..!

  • ఫోర్బ్స్ 2024 బిలియనీర్ల జాబితాలో ఇండియ‌న్ బ్ర‌ద‌ర్స్‌ జహాన్ మిస్త్రీ, ఫిరోజ్ మిస్త్రీల‌కు చోటు
  • వారి నెట్ వ‌ర్త్ వ‌చ్చేసి సుమారు రూ. 81,631 కోట్లు
  • ప్రపంచంలోని టాప్-25 యువ బిలియనీర్ల‌లో ఒక‌రిగా భారతీయ సోదరులు
  • ఈ భారీ సంప‌ద‌ను తండ్రి సైరస్ మిస్త్రీ నుండి వారసత్వంగా పొందిన బ్ర‌ద‌ర్స్‌
  • ప్రపంచంలోనే అత్యంత పిన్న వయసు బిలియనీర్‌గా లివియా వోయిగ్ట్‌
Indian brothers who are now richest billionaires under 30 Zahan Mistry and Firoz Mistry

ఫోర్బ్స్ ఇటీవల 2024 బిలియనీర్ల జాబితాను విడుదల చేసిన విష‌యం తెలిసిందే. ఈ జాబితాలో ప్రపంచంలోని టాప్-25 యువ బిలియనీర్‌లకు కూడా చోటు క‌ల్పించింది. వీరంతా 33 లేదా అంతకంటే తక్కువ వయసు క‌లిగిన వారే కావ‌డం గ‌మ‌నార్హం. ఈ పాతిక మంది యువ బిలియ‌నీర్ల‌ మొత్తం నెట్ వ‌ర్త్ వ‌చ్చేసి దాదాపు 110 బిలియన్ డాలర్లు. అంటే భార‌తీయ క‌రెన్సీలో సుమారు రూ. 9 లక్షల కోట్లు. 

ఈ 25 మంది యువ బిలియ‌నీర్ల‌లో ఇద్ద‌రు భార‌తీయ సోద‌రులు కూడా ఉన్నారు. వారే టాటా సన్స్ మాజీ ఛైర్మన్‌, దివంగత సైరస్ మిస్త్రీ కుమారులు జహాన్ మిస్త్రీ, ఫిరోజ్ మిస్త్రీ. కాగా, సైరస్ మిస్త్రీ 2022లో కారు ప్రమాదంలో చ‌నిపోయిన విష‌యం తెలిసిందే.   

ఇక 2024 ఫోర్బ్స్ బిలియనీర్ల జాబితాలో చోటు ద‌క్కించుకున్న ఈ ఇద్దరు సోదరుల ఉమ్మడి నికర విలువ 9.8 బిలియన్లు ( రూ. 81,631 కోట్లు) గా ఉంది. 30 ఏళ్లలోపు అత్యంత సంపన్న బిలియనీర్లుగా ఉన్న భారతీయ సోదరులు జహాన్ మిస్త్రీ(25), ఫిరోజ్ మిస్త్రీ(27) ఈ భారీ సంప‌ద‌ను వారు త‌మ తండ్రి సైరస్ మిస్త్రీ నుండి వారసత్వంగా పొందారు. 

కాగా, జహాన్ మిస్త్రీ, ఫిరోజ్ మిస్త్రీ ఇద్ద‌రికి ఐర్లాండ్ పౌర‌స‌త్వం ఉంది. కానీ, ప్ర‌స్తుతం వారు దేశ ఆర్థిక రాజ‌ధాని ముంబైలో నివసిస్తున్నారు. టాటా సన్స్‌లో వారి ఫ్యామిలీ తాలూకు 18.4 శాతం వాటాలో కొంత భాగాన్ని ఈ సోద‌రులు వారసత్వంగా పొందారు. ఇప్పుడు ఇదే వారిని ప్రపంచంలోని టాప్-25 యువ బిలియనీర్‌ల జాబితాలో చేర్చింది. 

ఇక‌ జహాన్ మిస్త్రీ యేల్ విశ్వవిద్యాలయంలో చ‌దువుకున్నారు. అతని సోదరుడు ఫిరోజ్ మిస్త్రీ వార్విక్ యూనివ‌ర్సిటీలో ఉన్న‌త చ‌దువులు పూర్తి చేశారు. కాగా, మిస్త్రీ కుటుంబ వార‌స‌త్వం ఇలా ఓ వెలుగు వెల‌గ‌డానికి కార‌ణం వారి తాత పల్లోంజి మిస్త్రీ. అలాగే ఈ సోద‌రుల‌ మేనమామ అయిన‌ షాపూర్ మిస్త్రీ.. నిర్మాణ సంస్థ‌ షాపూర్‌జీ పల్లోంజీ గ్రూప్‌కు చైర్మన్. ఈ సంస్థ ముంబై వేదిక‌గా కార్య‌క‌లాపాలు నిర్వ‌హిస్తోంది. 

ప్రపంచంలోనే అత్యంత పిన్న వయసు బిలియనీర్‌గా లివియా వోయిగ్ట్‌
ఫోర్బ్స్ ఇటీవల ప్ర‌కటించిన‌ ప్రపంచ బిలియనీర్ల జాబితాలో బ్రెజిల్‌కు చెందిన క‌ళాశాల‌ విద్యార్థిని అయిన‌ లివియా వోయిగ్ట్‌ను ప్రపంచంలోనే అత్యంత పిన్న వయస్కురాలిగా పేర్కొంది. ఎలక్ట్రికల్ పరికరాల త‌యారీదారు డ‌బ్ల్యూఈజీలో లివియా వోయిగ్ట్‌ భారీ వాటాను కలిగి ఉన్నారు. 19 ఏళ్ల ఆమె నెట్ వ‌ర్త్ వ‌చ్చేసి అక్ష‌రాల 1.1 బిలియన్ డాలర్లు.

More Telugu News