Kishan Reddy: ఇచ్చిన హామీల‌ను అమ‌లు చేయ‌కుండా.. మ‌ళ్లీ ఓటు అడిగే నైతిక హ‌క్కు కాంగ్రెస్‌కు లేదు: కిష‌న్ రెడ్డి

  • హైద‌రాబాద్‌లోని పార్టీ కార్యాల‌యంలో బీజేపీ 44వ ఆవిర్భావ వేడుక‌ల్లో పాల్గొన్న కిష‌న్ రెడ్డి
  • రాహుల్ గాంధీ, తెలంగాణ ప్ర‌భుత్వంపై తీవ్ర విమ‌ర్శ‌లు
  • ఏ ముఖం పెట్టుకుని రాహుల్ గాంధీ తెలంగాణ‌కు వ‌స్తున్నారంటూ కిష‌న్ రెడ్డి ధ్వ‌జం  
Telangana BPJ President Kishan Reddy Criticizes Rahul Gandhi

బీజేపీ తెలంగాణ అధ్య‌క్షుడు, కేంద్ర‌మంత్రి కిష‌న్ రెడ్డి శ‌నివారం హైద‌రాబాద్‌లోని పార్టీ కార్యాల‌యంలో బీజేపీ 44వ ఆవిర్భావ వేడుక‌ల్లో పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలోని కాంగ్రెస్ స‌ర్కార్‌పై విమ‌ర్శ‌లు గుప్పించారు. ఇచ్చిన హామీల‌ను అమ‌లు చేయ‌డంలో రేవంత్ రెడ్డి ప్ర‌భుత్వం పూర్తి విఫ‌ల‌మైంద‌ని దుయ్య‌బ‌ట్టారు. గొప్ప‌గా చెప్పుకున్న ఆరు గ్యారంటీల‌ను అమ‌లు చేయించ‌లేని రాహుల్ గాంధీ ఏ ముఖం పెట్టుకుని తెలంగాణ‌కు వ‌స్తున్నారు? అని వ్యాఖ్యానించారు. తెలంగాణ‌లో కాంగ్రెస్ ప‌త‌నం ప్రారంభ‌మైంద‌ని అన్నారు.  

రాష్ట్ర ప్ర‌జ‌ల దృష్టి ఇప్పుడు బీజేపీపై ఉంద‌ని చెప్పిన కిష‌న్ రెడ్డి.. లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో వారు మోదీకే ఓటు వేయాల‌ని ఇప్ప‌టికే నిర్ణ‌యించుకున్నార‌ని చెప్పుకొచ్చారు. లోక్‌స‌భ‌ ఎన్నిక‌ల కోసం మెనిఫెస్టోలు విడుద‌ల చేయ‌డం కాద‌ని, ముందు రాష్ట్ర అసెంబ్లీ ఎన్నిక‌ల సంద‌ర్భంగా ఇచ్చిన హామీల‌ను కాంగ్రెస్ ప్ర‌భుత్వం అమ‌లు చేయాల‌ని మంత్రి డిమాండ్ చేశారు. ఇచ్చిన హామీల‌ను అమ‌లు చేయ‌కుండా, మ‌ళ్లీ ఓటు అడిగే నైతిక హ‌క్కు హ‌స్తం పార్టీకి లేద‌ని విమ‌ర్శించారు. అలాగే ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డికి పార్టీ ఫిరాయింపుల‌పై ఉన్న శ్ర‌ద్ధ‌.. ప‌థకాల అమ‌లుపై లేద‌ని కిష‌న్ రెడ్డి ధ్వ‌జ‌మెత్తారు.

More Telugu News