Iran: ప్రతీకారేచ్ఛతో రగిలిపోతున్న ఇరాన్.. అమెరికా, ఇజ్రాయెల్‌లో ఆందోళన

  • సోమవారం డమాస్కస్‌లో ఇరాన్ ఎంబసీపై ఇజ్రాయెల్ వైమానిక దాడి
  • దాడిలో ఇద్దరు ఇరాన్ కమాండర్ ల మృతి, అగ్గిమీద గుగ్గిలమైన ఇరాన్
  • ప్రతీకారం తప్పదంటూ హెచ్చరికలు
  • హై అలర్ట్‌లో అమెరికా, ఇజ్రాయెల్ సైన్యాలు
US preps for retaliatory Iran attack on Israel or its assets

తమ ఎంబసీపై ఇజ్రాయెల్ దాడికి ప్రతీకారం తీర్చుకుంటామంటూ ఇరాన్ హెచ్చరించిన నేపథ్యంలో అమెరికా అప్రమత్తమైంది. ఇరాన్ దాడి తప్పదన్న అంచనాకు వచ్చిన అగ్రరాజ్యం హైఅలర్ట్‌ ప్రకటించింది. ఇజ్రాయెల్ కూడా తన సైన్యాలను హెఅలర్ట్‌లో పెట్టింది. 

సోమవారం డమాస్కస్‌లోని ఇరాన్ ఎంబసీపై ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడిలో ఇద్దరు ఉన్నతస్థాయి కమాండర్ లు సహా ఐదుగురు దుర్మరణం చెందారు. ఇరాన్ ప్రత్యేక సైనిక దళం ‘కుడ్స్‌ ఫోర్స్‌’కు చెందిన కమాండర్ ల మరణంపై ఇరాన్ అగ్గిమీద గుగ్గిలమవుతోంది. శుక్రవారం ఇరాన్‌లో సైనికాధికారుల అంత్యక్రియలు నిర్వహించారు. తమ కమాండర్ లను పొట్టనపెట్టుకున్న ఇజ్రాయెల్‌పై ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్ ఈ సందర్భంగా హెచ్చరించింది. 

ఇరాన్ తన దళాలను హైఅలర్ట్‌లో పెట్టినట్టు అక్కడి అధికారులు తెలిపారు. ఇజ్రాయెల్‌కు తగ్గిన బుద్ధి చెప్పాలని నిర్ణయించుకున్నట్టు పేర్కొన్నారు. ‘‘మాపై దాడులు చేస్తున్న శత్రుమూకలకు తగిన సమాధానం చెబుతాం’’ అని ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ జనరల్ కమాండర్ హుస్సైసీ సలామీ హెచ్చరించారు. 

అయితే, ఇరాన్‌ ఎలాంటి దాడి జరపొచ్చన్న అంశంలో అమెరికా, ఇజ్రాయెల్‌కు స్పష్టత లేదని అధికారులు చెబుతున్నారు. అయితే, ఇజ్రాయెల్‌లోని నిఘా, సైనిక స్థావరాలను ఇరాన్ టార్గెట్ చేసుకోవచ్చని అమెరికా భావిస్తోంది. ఇరాన్ దాడికి తెగబడితే ఎలా ప్రతిస్పందించాలనే దానిపై కూడా అమెరికా కసరత్తు చేస్తోంది. డ్రోన్స్ లేదా మిస్సైళ్ల ప్రయోగంతో ఇరాన్‌పై ప్రతిదాడి చేయాలనే అంచనాకు వచ్చింది. మరోవైపు, ఇరాన్ అమెరికాకు గట్టి వార్నింగ్ ఇచ్చింది. ఇజ్రాయెల్ పన్నిన ఉచ్చులో పడొద్దని, ఈ అంశంలో జోక్యం చేసుకోవద్దని ట్విట్టర్ వేదికగా హెచ్చరించింది.

More Telugu News