KCR: మూర్ఖుడు, దుర్మార్గుడు అంటూ చంద్రబాబుపై కేసీఆర్ ఘాటు వ్యాఖ్యలు

  • చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు భూదాన్ పోచంపల్లిలో ఏడుగురు చేనేత కార్మికులు చనిపోయారని ఆవేదన
  • అప్పుడు రూ.50 వేల చొప్పున ఎక్స్‌గ్రేషియా ఇవ్వమని చెబితే ఆ దుర్మార్గుడు ఇవ్వలేదన్న కేసీఆర్
  • తాను భిక్షాటన చేసి రూ.7 లక్షలు జమ చేసి కార్మికులకు ఇచ్చానన్న కేసీఆర్
KCR fires at chandrababu naidu

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు నాయుడు అనే మూర్ఖుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో భూదాన్ పోచంపల్లిలో ఏడుగురు చేనేత కార్మికులు ఒకేరోజు చనిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. వారికి రూ.50వేల చొప్పున ఎక్స్‌గ్రేషియా ఇవ్వమని చెప్పానని... ఓ గడువు పెట్టి ఆ లోగా ఇవ్వకుంటే తాను భిక్షాటన చేసి ఇస్తానని హెచ్చరించానని.. అయినప్పటికీ ఆ దుర్మార్గుడు ఇవ్వలేదని ఘాటు వ్యాఖ్యలు చేశారు.

ఆయన ఇవ్వకపోవడంతో నిజామాబాద్ పట్టణం, హైదరాబాద్‌లోని అబిడ్స్‌లో భిక్షాటన చేశానని.. రూ.7 లక్షలు వస్తే ఆ చేనేత కార్మికులకు ఇచ్చినట్లు తెలిపారు. అలా గద్వాల, దుబ్బాక, భువనగిరి, సిరిసిల్లలో రోజూ చనిపోయే చేనేత కార్మికులకు ఎంతోకొంత సాయం అందించే ఉద్దేశ్యంలో భాగంగా కొన్ని పథకాలు పెట్టామన్నారు. అందులో భాగంగానే వారికి ప్రభుత్వం నుండి ఆర్డర్లు ఇచ్చామన్నారు.

ఆత్మహత్యలు వద్దని గోడల మీద రాతలు

ఉద్యమం సమయంలో సిరిసిల్లకు వెళుతుండగా గ్రామాల్లో చేనేత కార్మికులు ఆత్మహత్యలు చేసుకోవద్దని గోడల మీద రాతలు కనిపించేవని గుర్తు చేసుకున్నారు. ఆ రోజు తనతో పాటు ప్రొఫెసర్ జయశంకర్ ఉన్నారని, చావొద్దని గోడల మీద రాసిన పరిస్థితులు చూసి తమ కళ్ళ వెంట నీళ్లు వచ్చాయన్నారు. 65 ఏళ్ల స్వతంత్ర భారతంలో చావకండంటూ గోడల మీద రాతలు రాసే ప్రభుత్వాలను చూడటం కంటే దౌర్భాగ్యం ఏముందని తాము బాధపడ్డామన్నారు. అందుకే తెలంగాణ వచ్చాక చేనేత కార్మికులను ఆదుకోవాలని నిర్ణయించుకున్నామన్నారు. 

సిరిసిల్లలో ఒకేరోజు పదకొండు మంది చేనేత కార్మికులు చనిపోతే బీఆర్ఎస్ పార్టీ నుంచి రూ.50 లక్షలు తెచ్చి... ఓ ట్రస్ట్ ఏర్పాటు చేశామన్నారు. చేనేత కార్మికులకు అండగా ఉండాలని ఈ ట్రస్ట్ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఈ ట్రస్ట్ ఇప్పటికీ సిరిసిల్లలో ఉందన్నారు. దయచేసి ఎవరూ ఆత్మహత్య చేసుకోవద్దని... తెలంగాణ వస్తది... వచ్చాక బిడ్డల్లా చూసుకుంటామని చేనేత కార్మికులకు హామీ ఇచ్చామన్నారు. ఆత్మహత్యలు వద్దని చేనేత కార్మికులకు చెప్పామన్నారు. అనుకున్నట్లుగా దేవుడి దయవల్ల తెలంగాణ వచ్చిందని... మన ప్రభుత్వం వచ్చిందన్నారు.

More Telugu News