Nara Lokesh: సింగిల్ గా వస్తానన్న జగన్ ప్రతి ఎన్నికకు శవాలతో వస్తున్నారు: నారా లోకేశ్ వ్యంగ్యం

  • 2014లో తండ్రి శవం, 2019లో బాబాయి శవంతో రాజకీయం అంటూ విమర్శలు
  • ఇప్పుడు పెన్షనర్లను వాడుకుని లబ్ధి పొందాలని కుట్ర అంటూ ఫైర్
  • జగన్ రెడ్డి గొప్ప నటుడు అంటూ వ్యాఖ్యలు

Nara Lokesh satires on CM Jagan

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ సమక్షంలో గుంటూరు మాజీ డిప్యూటీ మేయర్ తాడిశెట్టి మురళి ఇవాళ టీడీపీలో చేరారు. ఈ సందర్భంగా లోకేశ్ మాట్లాడుతూ, ఏపీలో పెన్షన్ల వ్యవహారం తీవ్ర రూపు దాల్చడంపై స్పందించారు. ప్రతి ఎన్నికకు సింగిల్ గా వస్తానని చెబుతున్న జగన్, ప్రతిసారి శవాలతో వస్తున్నారని ఎద్దేవా చేశారు. 2014లో తండ్రి శవాన్ని వాడుకున్నారు, 2019లో బాబాయి శవాన్ని వాడుకున్నారు, ఇప్పుడు పెన్షనర్లను వాడుకుని ఎన్నికల్లో లబ్ధి పొందాలని చూస్తున్నారని నారా లోకేశ్ విమర్శించారు. 

"జగన్ రెడ్డి గొప్ప నటుడు. 2019లో బాబాయిని లేపేశాడు, ఇప్పుడు పెన్షన్ పేరుతో వృద్ధులను చంపేందుకు సిద్ధపడ్డాడు. టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి అధికారంలోకి వస్తే వాలంటీర్ల వ్యవస్థను కొనసాగించడంతో పాటు పెన్షన్, ఇతర సంక్షేమ కార్యక్రమాలను వాలంటీర్లతో ఇంటివద్దకే అందిస్తాం. చంద్రబాబునాయుడు 2019లో హామీ ఇవ్వకపోయినా పెన్షన్ ను రూ.1000 నుంచి 2 వేలకు పెంచారు. 

జగన్ మాయ మాటలకు ప్రజలు మోసపోవద్దు. జగన్ పాలనలో ఎన్నడూ లేని విధంగా బీసీ సోదరులపై 26 వేలకు పైగా అక్రమ కేసులు నమోదు చేశారు. తన అక్కను వేధిస్తున్నారని ప్రశ్నించినందుకు అమర్ నాథ్ గౌడ్ అనే బాలుడ్ని పెట్రోల్ పోసి దారుణంగా చంపారు. కూటమి ప్రభుత్వంలో బీసీలకు ప్రత్యేక రక్షణ చట్టం తీసుకువస్తాం. 

అధికారంలోకి వచ్చాక ఆదరణ పథకం పునరుద్ధరించి నాణ్యమైన పనిముట్లు అందజేస్తాం. గత టీడీపీ పాలనలో ఏనాడూ మైనార్టీలపై దాడులు జరగలేదు. రంజాన్ తోఫా, షాదీ ఖానాల నిర్మాణం, రంజాన్ సమయంలో మసీదుల మరమ్మతులకు నిధులు, దుల్హన్ పథకం, విదేశీ విద్య ద్వారా మైనార్టీలను ఆదుకున్నాం. మైనార్టీలను గుండెల్లో పెట్టుకుని చూసుకుంటాం. 

రాష్ట్ర అభివృద్ధి కోసమే బీజేపీతో పొత్తు పెట్టుకున్నాం. ఇప్పటికే 12 లక్షల కోట్ల అప్పు ఉంది. రేపు రాష్ట్రాభివృద్ధికి కేంద్ర సహకారం అవసరం. అందుకే ప్రజలంతా కూటమిని ఆశీర్వదించాల్సిందిగా కోరుతున్నాం" అంటూ లోకేశ్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

More Telugu News