Danam Nagender: నెక్స్ట్ సీజన్‌లో సన్‌రైజర్స్‌లో హైదరాబాద్ ఆటగాడు లేకుంటే ఉప్పల్‌లో మ్యాచ్ జరగనివ్వం: దానం నాగేందర్ హెచ్చరిక

  • అవసరమైతే స్టేడియం వద్దే రోజంతా కూర్చుంటామన్న దానం నాగేందర్
  • గతంలో హైదరాబాద్ కెప్టెన్ డేవిడ్ వార్నర్‌పై రాతపూర్వక ఫిర్యాదు చేశానన్న దానం నాగేందర్
  • ఇప్పుడు మరోసారి సన్ రైజర్స్‌పై తాను ఫిర్యాదు చేయబోతున్నట్లు వెల్లడి
  • పది నిమిషాల్లో టిక్కెట్లు అన్నీ ఎలా అయిపోయాయని ఆగ్రహం
Danam Nagendar warning to sun risers hyderabad

సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టులో ఒక్క తెలుగు ఆటగాడు కూడా లేడని... వచ్చే సీజన్‌లో కనుక ఈ జట్టులో హైదరాబాద్ ప్లేయర్ లేకుంటే ఉప్పల్‌లో ఒక్క మ్యాచ్ జరగనిచ్చేది లేదని కాంగ్రెస్ నేత, ఎమ్మెల్యే దానం నాగేందర్ హెచ్చరించారు. అవసరమైతే స్టేడియం వద్దే రోజంతా కూర్చుంటామన్నారు. గతంలో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు కెప్టెన్‌గా డేవిడ్ వార్నర్ ఉండేవారని... ఆయన ఫిక్సింగ్ చేస్తున్నాడని తాను రాతపూర్వక ఫిర్యాదు చేస్తే అతనిని కెప్టెన్‌గా తొలగించినట్లు చెప్పారు. ఇప్పుడు మరోసారి సన్ రైజర్స్‌పై తాను ఫిర్యాదు చేయబోతున్నానన్నారు.

ఈరోజు ఉప్పల్ స్టేడియంలో సైన్ రైజర్స్ హైదరాబాద్-చెన్నై సూపర్ కింగ్స్ మధ్య మ్యాచ్ ఉంది. ఈ నేపథ్యంలో దానం మాట్లాడుతూ... ఐపీఎల్ మ్యాచ్ టిక్కెట్లు ఆన్‌లైన్‌లో కేవలం పదిపదిహేను నిమిషాల్లో అయిపోయినట్లుగా చూపించిందని దానం ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లో టిక్కెట్లు దొరకకపోవడానికి హెచ్‌సీఏనే కారణమని ఆరోపించారు. కాంప్లిమెంటరీ పాస్‌ల‌ను హెచ్‌సీఏ బ్లాక్‌లో అమ్ముతోందన్నారు. తాను డీఎన్ఆర్ అకాడమీని నడుపుతున్నానని, బాక్సింగ్ అసోసియేషన్ అధ్యక్షుడిగా పని చేశానని గుర్తు చేశారు. హెచ్‌సీఏ తీరుపై చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేస్తాన‌న్నారు. సన్ రైజర్స్ టీంలో ఒక్క తెలుగు ప్లేయర్ లేడన్నారు. ఇది దారుణమన్నారు.

విద్యుత్ పునరుద్ధరణ

ఉప్పల్ స్టేడియంలో విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు. శుక్రవారం యథాతథంగా సన్‌రైజర్స్ హైదరాబాద్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. విద్యుత్ బకాయిలు చెల్లించేందుకు హెచ్‌సీఏకి విద్యుత్ శాఖ శుక్రవారం ఒకరోజు గడువు ఇచ్చింది.

More Telugu News