Congress: ఎన్నిక‌ల మేనిఫెస్టోను విడుద‌ల చేసిన కాంగ్రెస్‌

  • 'న్యాయ్ పాత్ర' పేరుతో మెనిఫెస్టో విడుద‌ల చేసిన హ‌స్తం పార్టీ
  • మెనిఫెస్టో విడుద‌ల చేసిన ఖ‌ర్గే, రాహుల్ గాంధీ, సోనియా గాంధీ
  • మోదీ పాల‌న‌లో అన్ని వ‌ర్గాల‌కు అన్యాయం జ‌రిగింద‌న్న కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే
Congress manifesto released

కాంగ్రెస్ శుక్రవారం 'న్యాయ్ పాత్ర' పేరుతో త‌న ఎన్నిక‌ల‌ మేనిఫెస్టోను విడుదల చేసింది. ఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో సీనియర్ నేతల సమక్షంలో కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే ఈ మెనిఫెస్టోను విడుద‌ల చేయ‌డం జ‌రిగింది. రాబోయే ఐదేళ్లకు తన విజన్ డాక్యుమెంట్‌ను హ‌స్తం పార్టీ ఆవిష్కరించింది. ఈ కార్య‌క్ర‌మంలో రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, చిదంబరం త‌దిత‌ర కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు. కాగా, శనివారం పార్టీ జైపూర్, హైదరాబాద్‌లలో ఒక్కొక్కటి చొప్పున రెండు 'మేనిఫెస్టో లాంచ్ మెగా ర్యాలీలను' నిర్వహించనుంది. 

అయితే, ఈ గ్రాండ్ ఓల్డ్ పార్టీ ఇప్పటికే 25 హామీలను వెల్లడించిన విష‌యం తెలిసిందే. దీనిని 'పాంచ్ న్యాయ్' లేదా న్యాయానికి ఐదు స్తంభాలు అని కాంగ్రెస్‌ పార్టీ చెబుతోంది. ఈ ఐదు స్తంభాల‌లో ఒక్కొక్క దాని కింద ఐదు 'గ్యారంటీలు' ఉన్నాయి.  'యువ న్యాయ్' (యువతకు), 'నారీ న్యాయ్' (మహిళలకు), 'కిసాన్ న్యాయ్' (రైతుల కోసం), 'శ్రామిక్ న్యాయ్' (కార్మికులకు) మరియు 'హిస్సేదారి న్యాయ్' (జనాభా నిష్పత్తి ప్రకారం అవకాశాలు).

మెనిఫెస్టో విడుద‌ల సంద‌ర్భంగా కాంగ్రెస్ చీఫ్ ఖ‌ర్గే మాట్లాడుతూ.. మోదీ పాల‌న‌లో అన్ని వ‌ర్గాల‌కు అన్యాయం జ‌రిగింద‌ని దుయ్య‌బ‌ట్టారు. కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి రాగానే అభివృద్ధి కొనసాగిస్తామ‌న్నారు. త‌మ పార్టీ అధికారంలోకి వ‌చ్చిన వెంట‌నే కులగ‌ణన చేప‌డ‌తామ‌ని హామీ ఇచ్చారు. అలాగే పేద మ‌హిళ‌ల‌కు ఏడాదికి రూ. ల‌క్ష అందిస్తామ‌ని తెలిపారు. కిసాన్ న్యాయ్ పేరుతో రైతుల‌ను ఆదుకుంటామ‌ని స్ప‌ష్టం చేశారు. క‌నీస మ‌ద్ద‌తు ధ‌ర చ‌ట్టం తీసుకువ‌స్తామ‌న్నారు. 

మ‌రోవైపు అధికార బీజేపీ సైతం దాని మేనిఫెస్టో కమిటీ సమావేశాన్ని నిర్వహించింది. 27 మంది సభ్యులు ఉన్న ఈ ప్యానెల్‌కు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ నేతృత్వం వహిస్తున్నారు. 

లోక్ సభ ఎన్నికలు 2024 తాలూకు దశల వారీ షెడ్యూల్

• మొద‌టి దశ- ఏప్రిల్ 19

• రెండో దశ- ఏప్రిల్ 26

• మూడో దశ- మే 7

• నాలుగో దశ- మే 13

• ఐదో దశ- మే 20

• ఆరో దశ- మే 25

• ఏడో దశ- జూన్ 1

మొత్తం 543 లోక్‌సభ స్థానాలకు జూన్ 4న ఓట్ల లెక్కింపు జరగనుంది.

More Telugu News