Mahalaxmi Scheme: టీఎస్ఆర్‌టీసీకి మ‌హాల‌క్ష్మి ప‌థ‌కం దెబ్బ‌.. భారీగా త‌గ్గిన‌ బ‌స్సు పాస్‌లు!

  • 40 శాతం త‌గ్గిన బ‌స్సు పాస్‌ల సంఖ్య‌
  • మ‌హాల‌క్ష్మి ప‌థ‌కం అమ‌లుతో 2.82 ల‌క్ష‌ల‌కు ప‌డిపోయిన బ‌స్సు పాస్‌లు
  • అదే స‌మ‌యంలో భారీగా పెరిగిన ప్ర‌యాణికుల సంఖ్య‌
  • గ‌తంలో ప్ర‌యాణికుల సంఖ్య‌ 11 ల‌క్ష‌లుగా ఉంటే, ఇప్పుడు 21 ల‌క్ష‌ల‌కు చేరిన వైనం
Mahalaxmi Scheme Effects on Bus Pass in Telangana

గ‌తేడాది డిసెంబ‌ర్ 9వ తేదీ నుంచి తెలంగాణ‌లో కాంగ్రెస్ ప్ర‌భుత్వం మ‌హాల‌క్ష్మి ప‌థ‌కాన్ని తీసుకువ‌చ్చింది. ఈ ప‌థ‌కం ద్వారా మ‌హిళ‌ల‌కు బ‌స్సుల్లో ఉచిత ప్ర‌యాణ సౌక‌ర్యం క‌ల్పించింది. దీంతో ప్ర‌యాణికుల సంఖ్య పెరిగింది. ఇక హైదరాబాద్ న‌గ‌రంలో సిటీ బ‌స్సుల ప్ర‌యాణాలు కూడా భారీగా పెరిగాయి. గ‌తంలో 11 ల‌క్ష‌లుగా ఉన్న ప్ర‌యాణికుల సంఖ్య ఇప్పుడు 21 ల‌క్ష‌ల‌కు చేరింది. కానీ, బ‌స్సు పాస్‌లు మాత్రం ఏకంగా 40 శాతం త‌గ్గాయి. 

ఉచిత ప్రయాణం దెబ్బ‌..
మ‌హాల‌క్ష్మి పథ‌కం ప్ర‌భావం న‌గ‌రంలో తిరిగే అన్ని ర‌కాల బ‌స్సు పాస్‌ల‌పై ప‌డింది. ఉమ్మ‌డి రాష్ట్రంగా ఉన్న‌ప్పుడు న‌గ‌రంలో 7 ల‌క్ష‌లకు పైగా బ‌స్సు పాస్‌లు ఉంటే.. విడిపోయిన త‌ర్వాత ఈ సంఖ్య 4.50 ల‌క్ష‌ల‌కు ప‌డిపోయింది. ఇక క‌రోనా దెబ్బ‌కు 3.9 ల‌క్ష‌ల‌కు చేరింది. అనంత‌రం మ‌హాల‌క్ష్మి ప‌థ‌కం అమ‌లుతో 2.82 ల‌క్ష‌ల‌కు ప‌డిపోయింది. కాగా, ప్ర‌యాణికుల సంఖ్య భారీగా పెరిగిన‌ట్లు లెక్కలు చెబుతున్నా.. ఇందులో మ‌హిళా ప్ర‌యాణికుల సంఖ్య 5 ల‌క్ష‌ల నుంచి 10 ల‌క్ష‌ల వ‌ర‌కు పెర‌గ‌డం గ‌మ‌నార్హం. మ‌హాల‌క్ష్మి ప‌థ‌కం ద్వారా ఉచిత ప్ర‌యాణ సౌక‌ర్యం ఉండ‌డంతో విద్యార్థులు, పేద మ‌హిళ‌లు, ఉద్యోగులు ఇలా అంద‌రూ భారీ సంఖ్య‌లో ప్ర‌యాణం చేస్తున్నారు.  

న‌గ‌రంలో ప్ర‌స్తుతం బ‌స్సు పాస్‌ల వివ‌రాలు ఇలా..
విద్యార్థులు- 1,60,000
జ‌న‌ర‌ల్- 90,000
దివ్యాంగులు- 30,000
ఎన్‌జీఓ- 2,000
మొత్తం- 2,82,000

న‌గ‌రంలో భారీగా త‌గ్గిన బ‌స్సుల సంఖ్య‌..
న‌గ‌రంలో ప్ర‌స్తుతం 2850 బ‌స్సులు తిరుగుతున్నాయి. ఇందులో 120 వ‌ర‌కు ఏసీ బ‌స్సులు ఉన్నాయి. ఇటీవ‌ల ఎల‌క్ట్రిక్ నాన్ ఏసీ బ‌స్సులు 22 వ‌చ్చినా.. అవి స‌రిపోవ‌డం లేదు. ఉమ్మ‌డి రాష్ట్రంలో 4వేల‌కు పైగా బ‌స్సులు ఉండేవి. క‌రోనాకు ముందు వ‌ర‌కు 3,850 బ‌స్సులు తిరిగేవి, 30 ల‌క్ష‌ల వ‌ర‌కు ప్ర‌యాణికులు ఉండేవారని లెక్క‌లు చెబుతున్నాయి. న‌గ‌రంలో ప్ర‌స్తుతం 7,500 వ‌ర‌కు బ‌స్సులు అవ‌స‌ర‌మ‌ని ఆర్‌టీసీ నివేదిక‌లు పేర్కొంటున్నాయి. ఇలా బ‌స్సుల సంఖ్య పెరిగితే ఆటోమెటిక్‌గా మ‌ళ్లీ ప్ర‌యాణికుల సంఖ్యతో పాటు బ‌స్సు పాస్‌లు కూడా పెరుగుతాయ‌నేది ప్రజార‌వాణా నిపుణులు చెబుతున్న‌మాట‌.

More Telugu News