Chirag Paswan: చిరాగ్ పాశ్వాన్‌కు ఎదురుదెబ్బ‌.. 22 మంది సీనియ‌ర్‌ నేత‌ల రాజీనామా!

  • చిరాగ్ పాశ్వాన్ నేతృత్వంలోని లోక్‌జ‌న‌ శ‌క్తి పార్టీలో కుదుపు
  • పార్టీ వీడిన వారిలో రేణు కుశ్వాహా, స‌తీశ్ కుమార్‌, సంజ‌య్ సింగ్,  ర‌వీంద్ర సింగ్ వంటి కీల‌క నేత‌లు 
  • లోక్‌స‌భ సీట్ల కేటాయింపులో అక్ర‌మాలు జ‌రుగుతున్నాయ‌న్న సీనియ‌ర్‌ నేత‌లు
  • ఇక‌పై విప‌క్ష కూట‌మి 'ఇండియా'కు తాము మ‌ద్ద‌తుగా నిల‌వ‌బోతున్న‌ట్లు ప్ర‌క‌టన‌
22 leaders from Chirag Paswan party resign

 బీహార్‌లో చిరాగ్ పాశ్వాన్ నేతృత్వంలోని లోక్‌జ‌న‌ శ‌క్తి పార్టీకి ఎదురుదెబ్బ త‌గిలింది. లోక్‌జ‌న‌ శ‌క్తికి చెందిన 22 మంది సీనియ‌ర్‌ నేత‌లు పార్టీకి రాజీనామా చేశారు. పార్టీ వీడిన వారిలో పార్టీ జాతీయ ఉపాధ్య‌క్షురాలు రేణు కుశ్వాహా, జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి స‌తీశ్ కుమార్‌, రాష్ట్ర శాఖ ఉపాధ్య‌క్షుడు సంజ‌య్ సింగ్, ర‌వీంద్ర సింగ్ వంటి కీల‌క నేత‌లు ఉన్నారు. లోక్‌స‌భ సీట్ల కేటాయింపులో అక్ర‌మాలు జ‌రుగుతున్నాయ‌ని ఆరోపిస్తూ వీరంతా పార్టీకి రాజీనామా చేశారు. 

అంతేగాక ఇక‌పై విప‌క్ష కూట‌మి 'ఇండియా'కు తాము మ‌ద్ద‌తుగా నిల‌వ‌బోతున్న‌ట్లు ప్ర‌క‌టించారు. ఈ సంద‌ర్భంగా చిరాగ్ పాశ్వాన్ ఆయ‌న స‌న్నిహితులు స్వ‌యంగా లోక్‌స‌భ సీట్ల‌ను విక్ర‌యిస్తున్నార‌ని నేత‌లు ఆరోపించారు. వైశాలి, స‌మ‌స్తీపూర్‌, ఖ‌గ‌డియా పార్ల‌మెంట్ స్థానాల కోసం రూ. కోట్ల‌లో తీసుకున్నార‌ని ఆరోప‌ణ‌లు చేశారు. ఆయా స్థానాల‌లో అభ్య‌ర్థులను ఖ‌రారు చేసే స‌య‌మంలో క‌నీసం పార్టీలోని సీనియ‌ర్ల అభిప్రాయాల‌ను కూడా తెలుసుకోలేద‌ని నేత‌లు దుయ్య‌బ‌ట్టారు. కాగా, లోక్‌స‌భ ఎన్నిక‌ల ముందు ఎన్‌డీఏ భాగ‌స్వామ్య‌ప‌క్ష‌మైన లోక్‌జ‌న శ‌క్తి పార్టీకి సీనియ‌ర్ నేత‌ల రాజీనామా భారీ ఎదురుదెబ్బ అని రాజ‌కీయ విశ్లేష‌కులు చెబుతున్నారు.

More Telugu News