Botswana: ఇలాంటి 'గిఫ్ట్' హెచ్చరికలు కూడా ఉంటాయా...?

  • బోట్సువానాలో ఏనుగుల సంఖ్య 1.30 లక్షలు
  • ఏనుగుల వేటకు ప్రభుత్వ అనుమతి
  • అభ్యంతరం వ్యక్తం చేస్తున్న జర్మనీ, బ్రిటన్
  • 20 వేల ఏనుగులు గిఫ్టుగా పంపిస్తామని జర్మనీకి బోట్సువానా హెచ్చరిక 
Botswana warns Germany on elephant hunting

అతి సర్వత్ర వర్జయేత్ అన్నారు. ఏదైనా మితి మీరితే ప్రమాదం అని దానర్థం. ఇది వన్యప్రాణి జనాభాకు కూడా వర్తిస్తుంది. అడవుల్లోని జంతువులు లెక్కకు మిక్కిలిగా పెరిగితే అవి జనావాసాల్లోకి వచ్చి సాధారణ ప్రజా జీవితానికి ఆటంకంగా మారతాయి. ముఖ్యంగా, వ్యవసాయానికి పెను విఘాతం కలిగిస్తాయి. 

అందుకే, కొన్ని దేశాల్లో కొన్ని రకాల జంతువుల వేటకు ప్రభుత్వాలే అనుమతిస్తాయి. ఆస్ట్రేలియాలో కుందేళ్లు, స్కాట్లాండ్ లో దుప్పుల జనాభా భారీగా పెరిగిపోతుండడంతో, అక్కడి ప్రభుత్వాలు వీటిని చంపేయమని పౌరులకు సూచిస్తుంటాయి. 

ఆఫ్రికా ఖండంలోని బోట్సువానా దేశం పరిస్థితి కూడా ఇంతే. ఈ దేశంలో ఏనుగుల సంఖ్య 1.30 లక్షలు. ప్రపంచంలో అత్యధిక సంఖ్యలో ఏనుగులు మనుగడ సాగిస్తున్న దేశాల్లో బోట్సువానా ఒకటి. ఏనుగుల జనాభాను తగ్గించడానికి వాటిని వేటాడేందుకు ప్రభుత్వం గతంలో అనుమతి ఇచ్చింది. ఈ అనుమతిని 2014లో ఉపసంహరించుకున్నారు. ప్రజలు ఒత్తిడి చేయడంతో నాలుగేళ్ల కిందట ఏనుగుల వేటను పునరుద్ధరించారు. అయితే, ఏడాదికి ఇన్ని ఏనుగులను మాత్రమే వేటాడాలన్న నిబంధనతో పరిమితి తీసుకువచ్చారు. 

బోట్సువానాలో చాలామంది ప్రజలకు ఈ ఏనుగుల వేట ఓ ఆదాయ వనరు. కానీ బ్రిటన్, జర్మనీ వంటి యూరప్ దేశాలు ఈ వేట పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. వన్యప్రాణుల వేట సరికాదని జర్మనీ స్పష్టం చేసింది. ఈ వేటపై ఆంక్షలు విధించడంపై జర్మనీ పర్యావరణ మంత్రిత్వ శాఖ ఓ ప్రతిపాదన చేసింది. దీనిపై బోట్సువానా ప్రభుత్వం మండిపడింది. మీరు ఇలాంటి ప్రతిపాదనలు చేస్తే, మేం మీకు 20 వేల ఏనుగులను కానుకగా పంపాల్సి ఉంటుందని బోట్సువానా అధ్యక్షుడు మసిసి హెచ్చరించారు. 

"మా దేశంలో ఏనుగుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. గ్రామాల్లోకి వచ్చి పంటలను ధ్వంసం చేస్తున్నాయి. ఇళ్లను కూల్చివేస్తున్నాయి. ఇక్కడి సమస్యల గురించి మీరు ఎక్కడో బెర్లిన్ లో కూర్చుని మాట్లాడడం తేలికే. కానీ ప్రపంచం కోసం ఆ జంతువులను కాపాడితే మేం భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. ఏనుగులను చంపవద్దంటున్నారు... అందుకే ఆ ఏనుగులను మీకు పంపిస్తాం, మీరు కూడా వాటితో కలిసి జీవించండి. ఇది తమాషాగా చెబుతున్న మాట కాదు" అని మసిసి స్పష్టం చేశారు. 

ఏనుగుల వేట నిలిపివేస్తే తమ దేశం మరింత దుర్భిక్షంలోకి వెళుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఏనుగుల జనాభాను అదుపులో ఉంచాలంటే వేట తప్పనిసరి అని అభిప్రాయపడ్డారు. 

కాగా, బోట్సువానా గతంలో బ్రిటన్ కు కూడా ఇదే తరహాలో గిఫ్టు హెచ్చరికను జారీ చేసింది. పర్యావరణం అనే మాటెత్తితే 10 వేల ఏనుగులను పంపిస్తామని బ్రిటన్ ప్రభుత్వానికి వార్నింగ్ ఇచ్చింది.

More Telugu News