Revanth Reddy: కెమికల్ ఫ్యాక్టరీలో పేలుడు ఘటన పట్ల సీఎం రేవంత్ రెడ్డి, మాజీ సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి

  • గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులకు ఆదేశం
  • మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపిన ముఖ్యమంత్రి
  • ప్రమాదానికి గల కారణాలపై ఆరా 
  • బాధితులకు మెరుగైన వైద్య చికిత్స అందించాలని కలెక్టర్, ఎస్పీలను ఆదేశాలు
Revanth Reddy orders on Chemical factory blast

మెదక్ జిల్లా హత్నూరు మండలం చందాపూర్‌లోని ఎస్బీ కెమికల్ ఫ్యాక్టరీలో పేలుడు ఘటనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీశారు. సహాయక చర్యలు చేపట్టాలని ఫైర్ సర్వీసెస్ డీజీని ఆదేశించారు. డీజీ నాగిరెడ్డి ఘటానస్థలికి చేరుకున్నారు. బాధితులకు మెరుగైన వైద్య చికిత్స అందించాలని కలెక్టర్, ఎస్పీలను సీఎం ఆదేశించారు.

ఘటనాస్థలంలో పరిస్థితిని మంత్రులు దామోదర రాజనర్సింహ, కొండా సురేఖలు పర్యవేక్షిస్తున్నారు. కంపెనీలో రక్షణ చర్యలు లేకపోవడం వల్లే ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని కొండా సురేఖ అన్నారు. మంటలు ఆరిపోయిన తర్వాత మృతులను గుర్తిస్తామని కలెక్టర్ చెప్పారని తెలిపారు. క్షతగాత్రులకు చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు.

కేసీఆర్ దిగ్భ్రాంతి

ఎస్బీ కెమికల్ ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదంపై కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పేలుడులో తీవ్రంగా గాయపడిన కార్మికులకు మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వం వెంటనే సహాయక చర్యలు చేపట్టాలని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు విజ్ఞప్తి చేశారు. అందరికీ మెరుగైన చికిత్స అందించాలని కోరారు.

ఈ రోజు సాయంత్రం ఎస్బీ కెమికల్ ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం జరిగింది. రియాక్టర్ పేలడంతో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో 7గురు మృతి చెందగా, 25 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను ఏరియా ఆసుపత్రికి తరలించారు. ప్రమాద సమయంలో ప్లాంట్‌లో 50 మంది కార్మికులు ఉన్నారు. రియాక్టర్ పేలడంతో తమను కాపాడాలంటూ కార్మికులు ఆర్తనాదాలు చేశారు.

More Telugu News