Raghu Rama Krishna Raju: మూడ్నాలుగు రోజుల్లో శుభవార్త వస్తుందని ఆశిస్తున్నా: రఘురామకృష్ణరాజు

  • నేడు విజయవాడ వచ్చిన రఘురామ
  • గన్నవరం ఎయిర్ పోర్టులో స్వాగతం పలికిన టీడీపీ శ్రేణులు
  • దుర్గమ్మ దర్శనం చేసుకున్న రఘురామ
  • వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానని ఆశాభావం 
Raghu Rama Krishna Raju said he thinks good news will come soon

నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు ఇప్పటికీ తనకు ఎంపీ టికెట్ వస్తుందన్న ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవలే వైసీపీకి రాజీనామా చేసిన ఆయన టీడీపీ-జనసేన-బీజేపీ కూటమికి బాహాటంగా మద్దతు ప్రకటించారు. కానీ ఏ పార్టీలో చేరకుండా, వేచి చూసే ధోరణి అవలంబించారు. 

ఏపీలో 25 ఎంపీ స్థానాలు ఉండగా, టీడీపీ 17, బీజేపీ 6, జనసేన 2 సీట్ల చొప్పున పంచుకున్నాయి. కూటమిలో ఏ పార్టీ కూడా రఘురామకు టికెట్ కేటాయించలేదు. దాంతో ఆయన తీవ్ర నిరాశకు గురయ్యారు. 

ఈ నేపథ్యంలో, నేడు రఘురామకృష్ణరాజు విజయవాడ వచ్చారు. గన్నవరం ఎయిర్ పోర్టులో రఘురామకృష్ణరాజుకు టీడీపీ శ్రేణులు స్వాగతం పలికాయి. అనంతరం, రఘురామ బెజవాడ కనకదుర్గమ్మ దర్శనానికి వెళ్లారు. వచ్చే ఎన్నికల్లో తాను తప్పక పోటీ చేస్తానని ఆశాభావం వ్యక్తం చేశారు. మూడు నాలుగు రోజుల్లో శుభవార్త వస్తుందని ఆశిస్తున్నట్టు తెలిపారు.

More Telugu News