Japan: భారతీయుల కోసం టూరిస్ట్ ఈ-వీసా ప్రవేశపెట్టిన జపాన్

  • పాస్‌పోర్టుపై వీసా స్టిక్కర్లు లేకుండానే జారీ 
  • గరిష్ఠంగా 90 రోజులు జపాన్‌లో నివసించే అవకాశం
  • భారతీయ పర్యాటకులను ఆకర్షించడమే లక్ష్యంగా కొత్త వీసా ప్రోగ్రామ్‌ను ప్రవేశపెట్టిన జపాన్
Japan rolls out tourist e Visa for Indians

భారతీయ పర్యాటకులను ఆకర్షించడమే లక్ష్యంగా జపాన్ ‘ఈ-వీసా’ను ప్రవేశపెట్టింది. దీంతో పర్యాటకులు తమ పాస్‌పోర్టులలో భౌతిక స్టిక్కర్ల అవసరం లేకుండా ఈ కొత్త విధానాన్ని తీసుకొచ్చింది. ఏప్రిల్ 1, 2024 నుంచే ఈ-వీసా జారీ ఆరంభమైంది. ఈ కొత్త పోగ్రామ్‌లో భారతీయ పర్యాటకులు ఆన్‌లైన్‌లోనే వీసా కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. వీఎఫ్ఎస్ గ్లోబల్ ద్వారా నిర్వహిస్తున్న జపాన్ వీసా అప్లికేషన్ సెంటర్లలో దరఖాస్తు చేసుకోవచ్చు. పర్యాటకుల సౌలభ్యం కోసం ప్రవేశపెట్టిన ఈ-వీసా ప్రోగ్రామ్‌లో వీసా పొందినవారు జపాన్‌లో గరిష్ఠంగా 90 రోజులు పర్యటించవచ్చు. అయితే జపాన్‌లోకి ఎంట్రీ మాత్రం ఒకే ఒక్కసారి ఉంటుంది. అర్హత కలిగివున్న భారతీయులతో పాటు ఇండియాలో నివసిస్తున్న విదేశీయులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.

దరఖాస్తు చేసుకునే విధానం ఇదే..
1. జపాన్ వీసా అధికారిక వెబ్‌సైట్ https://visa.vfsglobal.com/ind/en/jpn/. ను సందర్శించాలి. 
2. అప్లికేషన్ ఫామ్‌ను డౌన్‌లోడ్ చేసుకొని వివరాలు పొందుపరచాలి. ఫొటోలతో సహా అవసరమైన ధ్రువీకరణ పత్రాలు సిద్ధం చేసుకోవాలి.
3. అప్లికేషన్‌ను సమర్పించడానికి అపాయింట్‌మెంట్ తేదీని బుక్ చేసుకోవాలి. దీంతో అపాయింట్‌మెంట్ లెటర్‌తో కూడిన ఈ-మెయిల్‌ వస్తుంది.
4. దరఖాస్తును అందజేసి.. నిర్ణయం కోసం వేచిచూడాల్సి ఉంటుంది. వీసా అప్లికేషన్‌ స్టేటస్‌ని ఆన్‌లైన్‌లో ట్రాక్ చేసుకోవచ్చు.
5. విజయవంతంగా ఎంపికైన దరఖాస్తుదారులకు ఎలక్ట్రానిక్ వీసా జారీ అవుతుంది. 
6. ప్రయాణ సమయంలో ఎయిర్‌పోర్టుల వద్ద చెక్-ఇన్ సమయంలో తమ డివైజ్‌లలోని వీసా చూపించాల్సి ఉంటుంది. ఈ-వీసాపై ఉన్న డిస్‌ప్లే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే సరిపోతుంది.

More Telugu News