YS Sharmila: అవినాశ్ హంతకుడు... కడపలో అతడు గెలవకూడదనే నేను పోటీ చేస్తున్నా: షర్మిల

  • ఏపీలో పలు ఎంపీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్
  • కడప ఎంపీ స్థానం అభ్యర్థిగా షర్మిల
  • హంతకుడు అవినాశ్ ను ఎంపీ కానివ్వకపోవడమే తన లక్ష్యమని వెల్లడి
  • ప్రజలందరూ తనను ఆశీర్వదించాలని విజ్ఞప్తి
Sharmila talks about being contest from Kadapa Lok Sabha constituency

కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం ఇవాళ ఏపీలో పలు ఎంపీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన సంగతి తెలిసిందే. కడప లోక్ సభ స్థానం అభ్యర్థిగా ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల పేరు ప్రకటించారు. దీనిపై షర్మిల స్పందించారు. కాంగ్రెస్ తరఫున కడప ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నానని వెల్లడించారు. అయితే, ఈ నిర్ణయం సులువైంది కాదని తనకు తెలుసని, కుటుంబం నిలువునా చీలుతుందని తెలిసినా నిర్ణయం తీసుకున్నానని స్పష్టం చేశారు. 

"నా అనుకున్న వాళ్లను జగనన్న నాశనం చేశారు. చిన్నాన్న వివేకాను చంపించిన వారిని జగనన్న వెనకేసుకొస్తున్నారు. తద్వారా హత్యా రాజకీయాలకు దన్నుగా నిలిచారు. చిన్నాన్న హంతకులను జగనన్న కాపాడుతున్నారు. 

చిన్నాన్నను హత్య చేయించిన అవినాశ్ కు టికెట్ ఇవ్వడాన్ని తట్టుకోలేకపోయాను. అవినాశ్ ఓ హంతకుడు... కడపలో అతడు మళ్లీ గెలవకూడదనే నేను పోటీ చేస్తున్నా. హంతకుడు అవినాశ్ ను ఎంపీ కానివ్వకపోవడమే నా లక్ష్యం. 

గత ఎన్నికల్లో వివేకా హత్యను వైసీపీ రాజకీయం కోసం ఉపయోగించుకుంది. నేను కడప ఎంపీగా నిలబడాలనేది చిన్నాన్న కోరిక. ఆయన కోరిక నెరవేర్చేందుకే కడప ఎంపీ బరిలో దిగుతున్నాను. ప్రజలందరూ నన్ను ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేస్తున్నా" అని షర్మిల పేర్కొన్నారు.

More Telugu News