KTR: రాష్ట్రంలో సెక్యులర్ పార్టీ ఉందంటే అది బీఆర్ఎస్ మాత్రమే!: కేటీఆర్

  • లోక్ సభ ఎన్నికల తర్వాత రేవంత్ రెడ్డి బీజేపీలోకి వెళ్లడం ఖాయమన్న కేటీఆర్
  • రేవంత్ రెడ్డి అయిదేళ్లు ముఖ్యమంత్రిగా ఉండాలని కోరుకుంటున్నామని వ్యాఖ్య
  • మల్కాజ్‌గిరిలో మనకు బీజేపీతోనే పోటీ అన్న కేటీఆర్
KTR lashes out at Revanth Reddy

లోక్ సభ ఎన్నికల తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీజేపీలోకి వెళ్లడం పక్కా అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఈ విషయంపై ఆయన ఎందుకు స్పందించడం లేదు? అని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి జేబుదొంగల మాదిరి జేబులో కత్తెర పెట్టుకొని తిరుగుతాడంట. మెడలో పేగులు వేసుకొని తిరిగేవాడు ముఖ్యమంత్రా? అని విమర్శించారు. ప్రభుత్వాన్ని పడగొడితే మానవబాంబు అవుతానని అంటున్నాడు... కానీ మాకు ఆ అవసరం లేదని... ఆయన పక్కనే నల్గొండ, ఖమ్మం మానవబాంబులే కూలగొడతాయని హెచ్చరించారు. మేడ్చ‌ల్ నియోజ‌క‌వ‌ర్గంలో ఏర్పాటు చేసిన మ‌ల్కాజ్‌గిరి పార్ల‌మెంట్ విస్తృతస్థాయి స‌మావేశంలో కేటీఆర్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ... రేవంత్ రెడ్డి అయిదేళ్లు ముఖ్యమంత్రిగా ఉండాలని... ఇచ్చిన 420 హామీలు అమలు చేయాలని కోరుకుంటున్నామన్నారు. దమ్ముంటే రేవంత్ రెడ్డి ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలనీ నెరవేర్చాలన్నారు. రుణమాఫీ చేస్తా అన్న పొంకనాల రెడ్డి.. .రేవంత్ రెడ్డి ఎక్కడ? అని ఎద్దేవా చేశారు. రుణమాఫీ అయినవాళ్లు కాంగ్రెస్‌కు ఓటు వేయండి... మిగతావాళ్లు బీఆర్ఎస్ వేయాలని కోరారు. మహిళలకు రూ.2500 ఇస్తానని చెప్పాడని... కానీ ఎవరికైనా వచ్చాయా? అని ప్రశ్నించారు. రైతులు, ఆటోడ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని... రాష్ట్రంలో ఏ వర్గం కూడా ఇప్పుడు సంతోషంగా లేదన్నారు.

ఏప్రిల్ 1న గ్రూప్ 2 నోటిఫికేషన్ అన్నాడని.. అది కూడా ఇవ్వలేదన్నారు. అప్పుడే కరెంట్ కోతలు మొదలయ్యాయని... బావుల వద్ద పడుకునే రోజులు మళ్లీ వచ్చాయన్నారు. ప్రజలు మోసపోవాలనే కోరుకుంటారని రేవంత్ రెడ్డి ముందే చెప్పాడని... కానీ మనమే తప్పు చేశామన్నారు. మనం చేసిన మంచి పనులను చెప్పుకునేంతగా చెప్పుకోలేదన్నారు. ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో జరిగిన తప్పు జరగకుండా చూసుకోవాలని సూచించారు. రాష్ట్రంలో సెక్యులర్ పార్టీ ఉందంటే అది బీఆర్ఎస్ మాత్రమే అన్నారు. ఉద్వేగాలు కాదు... ఉద్యోగాలు ఇచ్చే వాళ్లు కావాలని అందరికి తెలియజెప్పాలన్నారు.
ఎవరికి వారే అభ్యర్థిగా భావించి... కష్టపడి రాగిడి లక్ష్మారెడ్డిని గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు.

మనకు బీజేపీతోనే పోటీ

మ‌ల్కాజ్‌గిరి పార్ల‌మెంట్‌లో మ‌న‌కు పోటీ కాంగ్రెస్‌తో కాదు... బీజేపీతోనే అన్నారు. మ‌ల్లారెడ్డి ఎమ్మెల్యేగా, మంత్రిగా సేవ‌లందించి ఎన్నో ర‌కాల సంక్షేమ‌, అభివృద్ధి కార్య‌క్ర‌మాలు చేశారన్నారు. ఆయ‌న నియోజ‌క‌వ‌ర్గంలో 10 మున్సిపాలిటీలు ఉంటే అన్నింటికి అన్నీ గెలిచారన్నారు. మేడ్చ‌ల్‌లో బీఆర్ఎస్ బ‌ల‌మేందో తెలిసిపోయింద‌న్నారు. 

బీఆర్ఎస్ ఎంపీ అభ్య‌ర్థి రాగిడి ల‌క్ష్మారెడ్డి సామాజిక సేవ‌లు చేస్తూ మ‌ల్కాజ్‌గిరి పార్ల‌మెంట్‌లోని ప్ర‌జ‌ల‌తో క‌లిసి మెలిసి ఉన్నారన్నారు. మ‌న‌కు కాంగ్రెస్‌తో పోటీ లేదు... కేవ‌లం డ‌మ్మీ అభ్య‌ర్థిని మ‌న ప్రాంతంతో సంబంధంలేని వ్య‌క్తిని నిల‌బెట్టారన్నారు. చేవెళ్ల‌లో రిజెక్ట్ చేస్తే ఇక్క‌డ బ‌ల‌వంతంగా నిలబెట్టారన్నారు.

More Telugu News