Vijayasai Reddy: అమరావతి నుంచి ప్రతి జిల్లాకు బుల్లెట్ ట్రైన్ నడిపిస్తానని వేసేశాడు అప్పట్లో!: విజయసాయిరెడ్డి

  • కళ్లార్పకుండా అబద్ధాలు చెప్పడంలో చంద్రబాబు దిట్ట అంటూ విమర్శలు
  • ఇలాంటి వారిని పేథలాజికల్ లయర్స్ అంటారన్న విజయసాయి
  • ఇంకా పిట్టలదొర కబుర్లు చెబుతూనే ఉన్నారని ఎద్దేవా 
Vijayasai Reddy slams Chandrababu

రాజ్యసభ సభ్యుడు, నెల్లూరు లోక్ సభ వైసీపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి టీడీపీ అధినేత చంద్రబాబుపై విమర్శనాస్త్రాలు సంధించారు. కళ్లార్పకుండా అబద్ధాలు చెప్పడం చంద్రబాబు రక్తంలోనే ఉందని, ఇలాంటి వారిని సైకాలజీలో 'పేథలాజికల్ లయర్స్' అంటారని వ్యంగ్యంగా అన్నారు.  

అమరావతి నుంచి ప్రతి జిల్లాకు బుల్లెట్ ట్రైన్ నడిపిస్తానని వేసేశాడు అప్పట్లో అని ఎద్దేవా చేశారు. ఇలాంటి పిట్టలదొర కబుర్లు ఇంకా చెబుతూనే ఉన్నారని, 40 ఏళ్లుగా మైండ్ సెట్ మారనందున సమాజంలో వస్తున్న మార్పులు ఆయనకు అర్థం కావడంలేదని విజయసాయి విమర్శించారు. 

"మార్కాపురం వెళ్లి వెలిగొండ ప్రాజెక్టు పనులు తానే సగానికి పైగా పూర్తి చేశానని గడియారం స్తంభం సాక్షిగా నాలుక మడతేశారు. వెలిగొండ పూల సుబ్బయ్య ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసి 18.7 కిలోమీటర్ల పొడవైన మొదటి టన్నెల్ లో 14 కిలోమీటర్లు పూర్తి చేసింది దివంగత రాజశేఖర్ రెడ్డి అని అందరికీ తెలుసు. 2014-19 మధ్య చంద్రబాబు ప్రభుత్వం చచ్చీచెడీ 2 కి.మీ టన్నెల్ మాత్రమే తవ్వింది. 

వెలిగొండలో రెండు టన్నెల్ పనులను విజయవంతంగా పూర్తి చేసి జాతికి అంకితం చేసింది సీఎం జగన్. ఈ ప్రాజెక్టు పూర్తయితే ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాల్లో 4.5 లక్షల ఎకరాలకు సాగునీరు, 15 లక్షల మందికి మంచి నీరు సరఫరా అవుతుంది. ఫ్లోరైడ్ పీడ విరగడ అవుతుంది" అని విజయసాయి వివరించారు.

More Telugu News