Mumbai Indians: ముంబయి ఇండియన్స్ ఇవాళైనా గెలిచేనా?... టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్

  • ఐపీఎల్ లో నేడు ముంబయి ఇండియన్స్ × రాజస్థాన్ రాయల్స్
  • టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న రాజస్థాన్
  • వాంఖెడే స్టేడియంలో మ్యాచ్
  • ఇప్పటివరకు ఆడిన రెండు మ్యాచ్ ల్లోనూ ఓడిపోయిన ముంబయి 
RR won the toss against Mumbai Indians

ఐపీఎల్ లో ఐదు టైటిళ్లు గెలిచి అగ్రశ్రేణి జట్టుగా పేరుప్రఖ్యాతులు అందుకున్న ముంబయి ఇండియన్స్ గత కొన్ని సీజన్లుగా పేలవంగా ఆడుతోంది. రోహిత్ శర్మను కెప్టెన్సీ నుంచి తప్పించి, హార్దిక్ పాండ్యాను కొత్త కెప్టెన్ గా చేసినా ఆ జట్టు తలరాత మారలేదు. 

ఐపీఎల్ తాజా సీజన్ లో ముంబయి ఇండియన్స్ జట్టు తానాడిన రెండు మ్యాచ్ ల్లోనూ ఓడిపోయింది. తొలి మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ చేతిలో పరాజయం చవిచూసిన ముంబయి... రెండో మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ చేతిలో ఓడిపోయింది. కెప్టెన్ గానూ, ఆటగాడిగానూ హార్దిక్ పాండ్యా ఏమాత్రం తనదైన ముద్ర వేయలేకపోతున్నాడు. 

ఈ నేపథ్యంలో, ముంబయి జట్టు నేడు రాజస్థాన్ రాయల్స్ తో పోరుకు సిద్ధమైంది. ముంబయిలోని వాంఖెడే స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగుతుండడం ముంబయి ఇండియన్స్ కు కాస్త కలిసొచ్చే అంశం. టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్ బౌలింగ్ ఎంచుకుంది. 

ఈ మ్యాచ్ కోసం తమ జట్టులో ఎలాంటి మార్పులు లేవని ముంబయి ఇండియన్స్ సారథి హార్దిక్ పాండ్యా వెల్లడించాడు. రాజస్థాన్ జట్టులో సందీప్ స్థానంలో నాండ్రే బర్గర్ తుదిజట్టులోకి వచ్చాడు.

ఇరు జట్లలో గమనించదగ్గ ఆటగాళ్లు...

ముంబయి ఇండియన్స్: రోహిత్ శర్మ, తిలక్ వర్మ, టిమ్ డేవిడ్, జస్ప్రీత్ బుమ్రా, హార్దిక్ పాండ్యా.

రాజస్థాన్ రాయల్స్: యశస్వి జైస్వాల్, జోస్ బట్లర్, సంజు శాంసన్, రియాన్ పరాగ్, హెట్మెయర్, రవిచంద్రన్ అశ్విన్, ట్రెంట్ బౌల్ట్.

More Telugu News