Nitin Gadkari: పెట్రోల్, డీజిల్ కార్లను వదిలించుకోవడం అసాధ్యమేమీ కాదు: నితిన్ గడ్కరీ

  • కష్టమే కావొచ్చు.. కానీ అసాధ్యం కాదని అభిప్రాయపడిన కేంద్రమంత్రి
  • దేశాన్ని గ్రీన్‌ ఎకనామీగా మార్చడానికి హైబ్రిడ్ వాహనాలపై జీఎస్టీని తగ్గిస్తామన్న గడ్కరీ
  • దేశంలోని 36 కోట్లకు పైగా పెట్రోల్, డీజిల్ వాహనాలను వదిలించుకోవాల్సి ఉందని వ్యాఖ్య
Nitin Gadkari vows to eliminate petrol and diesel vehicles in India

త్వరలో పెట్రోల్, డీజిల్ వాహనాలను తొలగించాలని... ఇదేమీ అసాధ్యమైనది కాదని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. దేశాన్ని గ్రీన్ ఎకానమీగా మార్చేందుకు పెట్రోల్, డీజిల్ కార్లను పూర్తిగా వదిలించుకోవడం నూటికి నూరు శాతం సాధ్యమే అన్నారు. ఆయన పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ... ఇది కష్టమే కావొచ్చు.. కానీ అసాధ్యం కాదని అభిప్రాయపడ్డారు. ఈ లక్ష్యాన్ని చేరుకోవడానికి... దేశాన్ని గ్రీన్‌ ఎకనామీగా మార్చడానికి హైబ్రిడ్ వాహనాలపై జీఎస్టీని తగ్గిస్తామన్నారు. దేశంలోని 36 కోట్లకు పైగా పెట్రోల్, డీజిల్ వాహనాలను వదిలించుకోవాల్సి ఉందన్నారు.

గ్రీన్ ఎనర్జీ లక్ష్యం సాధించేందుకు ఎలాంటి టైమ్ లైన్ లేదన్నారు. హైబ్రిడ్ వాహనాలపై జీఎస్టీని ఐదు శాతానికి, ఫ్లెక్స్ ఇంజిన్లపై 12 శాతానికి తగ్గించే ప్రతిపాదనను ఆర్థిక మంత్రిత్వ శాఖకు పంపించినట్లు చెప్పారు. ఈ డిమాండ్‌ను పరిశీలిస్తున్నామన్నారు. జీవ ఇంధనాల వినియోగాన్ని ప్రోత్సహించడం ద్వారా దేశం ఇంధన దిగుమతులను తగ్గించగలదన్నారు. తాను 2004 నుంచి ప్రత్యామ్నాయ ఇంధనాలపై దృష్టి పెడుతున్నానని, రానున్న అయిదు నుంచి ఏడేళ్లలో పరిస్థితులు మారతాయని విశ్వాసం వ్యక్తం చేశారు.

ఇంధన దిగుమతులపై మనం ప్రతి ఏటా రూ.16 లక్షల కోట్లు ఖర్చు చేయాల్సి వస్తోందన్నారు. ఈ ఇంధన దిగుమతిని ఆపగలిగితే ఈ మొత్తంతో రైతుల జీవితాల్లో వెలుగులు నింపవచ్చునని, గ్రామాలను మరింత అభివృద్ధి చేయవచ్చునని, యువతకు ఉపాధి అవకాశాలు కల్పించవచ్చునని పేర్కొన్నారు. రాబోయే కాలంలో ప్రత్యామ్నాయ, జీవ ఇంధనాలు అందుబాటులోకి వస్తాయని, ఈ కల నిజమవుతుందని తాను బలంగా విశ్వసిస్తున్నానన్నారు. బజాజ్, టీవీఎస్, హీరో వంటి కంపెనీలు కూడా ఫ్లెక్స్ ఇంజిన్లను ఉపయోగించి మోటార్ సైకిళ్లను తయారు చేయాలని యోచిస్తున్నాయని తెలిపారు. 

త్వరలో ఆటో రిక్షాలు కూడా ఇలాంటి టెక్నాలజీని ఉపయోగించబోతున్నాయన్నారు. తాను ప్రస్తుతం హైడ్రోజన్‌తో నడిచే కారులో ప్రయాణిస్తున్నానని వెల్లడించారు. ప్రతి రెండో ఇంట్లో కరెంటుతో నడిచే కార్లను చూడవచ్చునన్నారు. దేశవ్యాప్తంగా 350 బయో సీఎన్జీ ఫ్యాక్టరీలు ఉన్నాయన్నారు. ఇంధన దిగుమతి ముగుస్తుందని.. దేశం ఆర్థిక స్వావలంభన సాధిస్తుందని.. ఈ విషయంలో పూర్తి విశ్వాసం ఉందన్నారు.

More Telugu News