April 1: నూతన ఆర్థిక సంవత్సరం 2024-25 షురూ.. అమల్లోకి కొత్త నిబంధనలు

  • నేటి నుంచి కొత్త చెల్లింపుదార్లకు డీఫాల్ట్‌గా వర్తించనున్న నూతన పన్ను విధానం
  • కీలకమైన 800 రకాల ఔషధాల ధరలు స్వల్పంగా పెరుగుదల
  • మార్చి 31 నాటికి కేవైసీ అప్‌డేట్ చేయకుంటే రెట్టింపు టోల్ ఛార్జీలకు అవకాశం
these new rules  come into effect from April 1

నేటి నుంచి (ఏప్రిల్ 1) నూతన ఆర్థిక సంవత్సరం 2024-25 ఆరంభమైంది. నెల ప్రారంభం కూడా కావడంతో దేశ సగటు వాసులను ప్రభావితం చూపే పన్ను సంబంధిత, డబ్బుతో ముడిపడిన పలు నూతన నిబంధనలు నేటి నుంచి అమల్లోకి వచ్చాయి. 

1. నేటి నుంచి నూతన పన్ను విధానం కొత్త చెల్లింపుదార్లకు డీఫాల్ట్‌గా వర్తిస్తుంది. చెల్లింపుదారులు పాత విధానాన్ని ఎంచుకోకపోతే ఆటోమేటిక్‌గా కొత్త విధానం వర్తిస్తుంది. నూతన పన్ను విధానంలో నిర్దేశిత పన్ను మినహాయింపు ఉంటుంది. కానీ పాత పన్నుల విధానం మాదిరిగా మినహాయింపులు ఏమీ వర్తించవు.

2. మార్చి 31 నాటికి కేవైసీని ధ్రువీకరించని స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్లు నేటి నుంచి పెట్టుబడులు, నగదు ఉపసంహరణలతో పాటు ఇతర లావాదేవీలను నిర్వహించడం సాధ్యపడదు. అయితే ఇప్పటికే ఉన్న పెట్టుబడుల విషయంలో కేవైసీ తప్పనిసరి కాదు.

3. లింక్డ్, నాన్-లింక్డ్ సంబంధిత బీమా పాలసీలపై ఖరారైన సరెండర్ ఛార్జీలు నేటి నుంచి అమల్లోకి వచ్చాయి. ఈ మేరకు ఐఆర్‌డీఏఐ ఇటీవలే ఛార్జీలను నిర్ణయించింది. పాలసీదారులు తమ బీమా పాలసీని సరెండర్ చేసిన నాటికి చెల్లించిన ప్రీమియంలలో 30-90 శాతం మొత్తం పొందవచ్చు.

4. దేశ జనాభాలో ఎక్కువ మందికి అవసరమైన ఔషధాల ధరలు నేటి నుంచి అతి స్వల్పంగా పెరగనున్నాయి. ఎన్‌ఎల్‌ఈఎం (నేషనల్ లిస్ట్ ఆఫ్ ఎసెన్షియల్ మెడిసిన్స్) చేర్చిన దాదాపు 800 రకాల మందుల ధరలు 0.0055 శాతం మేర పెగనున్నాయి. ఈ మేరకు కేంద్రం అనుమతినిచ్చింది.

5. పాలసీదారులందరూ ఏప్రిల్ 1 (నేటి) నుంచి తమ పాలసీలను డిజిటలైజ్డ్‌గా మార్చుకోవాల్సి ఉంటుంది. అంటే ప్రతి పాలసీదారుడు తన పాలసీని ఈ-ఇన్సూరెన్స్‌గా మార్చుకోవాలి. పాలసీలు అన్నింటిని ఎలక్ట్రానిక్ రూపంలో జారీ చేయాల్సి ఉంటుంది. ఈ మేరకు ఐఆర్‌డీఏఐ (రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా) ఇటీవలే ప్రకటన చేసింది. ఈ నిబంధన లైఫ్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ సహా అన్ని కేటగిరీల బీమాలకు వర్తిస్తుంది.

6. ఫాస్టాగ్‌లకు సంబంధించి కేవైసీని పూర్తి చేయని వాహనదారులు నేటి నుంచి రెట్టింపు ఛార్జీలను చెల్లించాల్సి ఉంటుంది. ఫాస్టాగ్‌ల కేవైసీని పూర్తి చేసేందుకు తుది గడువు మార్చి 31గా ఉంది. ఆదివారంతో ఈ గడువు ముగిసిపోయింది. దీంతో కేవైసీ సమాచారాన్ని అప్‌డేట్ చేయని వ్యక్తులు సేవల ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. టోల్ ప్లాజాల వద్ద రెట్టింపు ఛార్జీలు చెల్లించే అవకాశం ఉంటుంది.

More Telugu News