Delhi Capital: ఢిల్లీ ఆల్‌రౌండ్ షో.. చెన్నైకి పరాజయం రుచి చూపిన పంత్ సేన

  • రెండు వరుస ఓటముల తర్వాత ఢిల్లీ విజయం
  • మునుపటిలా బ్యాట్ ఝళిపించిన పంత్
  • పొదుపుగా బౌలింగ్ చేసి జట్టుకు విజయాన్ని అందించిన ముకేశ్‌కుమార్, ఖలీల్ అహ్మద్
  • మెరుపులు మెరిపించి విశాఖ ప్రేక్షకులను అలరించిన ధోనీ
Delhi Capitals Records First Win After Defeating CSK

మొత్తానికి ఢిల్లీ కేపిటల్స్ గాడిలో పడింది. రెండు వరుస పరాజయాల తర్వాత విజయం రుచి చూసింది. విశాఖపట్టణంలో గత రాత్రి చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 20 పరుగుల తేడాతో విజయం సాధించి పాయింట్ల ఖాతా తెరిచింది. తొలుత వార్నర్ (52), కెప్టెన్ పంత్ (51) అర్ధ సెంచరీలతో విరుచుకుపడగా ఆ తర్వాత ముకేశ్ కుమార్, ఖలీల్ అహ్మద్ పొదుపుగా బౌలింగ్ చేస్తూ వికెట్లు పడగొట్టడంతో గెలుపు సొంతం చేసుకుంది. డిఫెండింగ్ చాంపియన్ చెన్నైకి ఓటమి రుచి చూపింది.

ఢిల్లీ నిర్దేశించిన 192 పరుగుల విజయ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన చెన్నై ఆపసోపాలు పడింది. మూడు పరుగులకే తొలి వికెట్ కోల్పోయిన చెన్నై ఆ తర్వాత కూడా వరుసగా వికెట్లు కోల్పోతూ పరాజయం దిశగా పయనించింది. అజింక్య రహానే (45), డరిల్ మిచెల్ (34) మినహా జట్టులో ఎవరూ బ్యాట్ ఝళిపించలేకపోయారు. చివర్లో ధోనీ ధనాధన్ బ్యాటింగ్ చేసినప్పటికీ అప్పటికే సాధించాల్సిన స్కోరుకు, బంతులకు మధ్య వ్యత్యాసం బాగా ఉండడంతో పరాజయం తప్పలేదు. ధోనీ 16 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లతో విశాఖ ప్రేక్షకులను అలరించాడు. ధోనీ 18, జడేజా 21 పరుగులు చేశారు. ఫలితంగా 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 171 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఢిల్లీ బౌలర్లలో ఖలీల్ అహ్మద్ 2, అక్షర్ పటేల్ ఒక వికెట్ పడగొట్టగా, ముకేశ్ కుమార్ 3 వికెట్లు నేలకూల్చాడు.

పంత్ మునుపటిలా..
అంతకుముందు  టాస్ గెలిచిన ఢిల్లీ కెప్టెన్ రిషభ్ పంత్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలిస్తుండడంతో ఓపెనర్లు చెలరేగారు. పృథ్వీషా (43), డేవిడ్ వార్నర్ (52) యథేచ్ఛగా ఆడుకున్నారు. అర్ధ సెంచరీ చేసిన వెంటనే వార్నర్ అవుట్ కావడంతో క్రీజులోకి వచ్చిన పంత్.. మునుపటి పంత్‌ను తలపించాడు. జోరుగా ఆడుతూ, బంతులను స్టాండ్స్‌లోకి తరలిస్తూ స్కోరును పెంచుకుంటూ పోయాడు. ఈ క్రమంలో అర్ధ సెంచరీ పూర్తిచేసుకున్నాడు. మొత్తంగా 32 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లతో 51 పరుగులు చేసి అవుటయ్యాడు. మిచెల్ మార్ష్ 18 పరుగులు చేశాడు. సీఎస్కే బౌలర్లలో మహీశా పథిరన మూడు వికెట్లు తీసుకోగా, జడేజా, ముస్తాఫిజుర్ చెరో వికెట్ తీసుకున్నారు. నాలుగు ఓవర్లు వేసి ఓ మెయిడెన్ కూడా తీసుకుని 2 వికెట్లు పడగొట్టిన ఢిల్లీ బౌలర్ ఖలీల్ అహ్మద్‌కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. ఐపీఎల్‌లో నేడు ముంబై ఇండియన్స్-రాజస్థాన్ రాయల్స్ జట్లు ముంబైలో తలపడతాయి.

More Telugu News