SRH: సన్ రైజర్స్ కు భంగపాటు... గుజరాత్ టైటాన్స్ చేతిలో ఓటమి

  • అహ్మదాబాద్ లో 7 వికెట్ల తేడాతో ఓడిన సన్ రైజర్స్
  • ఏకపక్షంగా సాగిన మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ దే పైచేయి
  • 163 పరుగుల లక్ష్యాన్ని 19.1 ఓవర్లలో ఛేదించిన టైటాన్స్
  • అన్ని రంగాల్లో విఫలమైన సన్ రైజర్స్
SRH lost to Gujarat Titans by 7 wickets

ప్యాట్ కమిన్స్ నాయకత్వంలోని సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు గుజరాత్ టైటాన్స్ చేతిలో పరాభవం ఎదురైంది. ముంబయి ఇండియన్స్ పై రికార్డు స్థాయి విజయంతో అహ్మదాబాద్ చేరుకున్న సన్ రైజర్స్... ఇవాళ గుజరాత్ టైటాన్స్ కు ఏమాత్రం పోటీ ఇవ్వలేకపోయింది. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక స్కోరు సాధించిన జట్టు ఇదేనా అని సందేహం కలిగించేలా.... ఇవాళ గుజరాత్ చేతిలో 7 వికెట్లతో ఓటమిపాలైంది. 

ఇక్కడి నరేంద్ర మోదీ స్టేడియంలో ఏకపక్షంగా సాగిన ఈ మ్యాచ్ లో సన్ రైజర్స్ టాస్ గెలిచినా ప్రయోజనం లేకపోయింది. మొదట బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 162 పరుగులు చేయగా... గుజరాత్ జట్టు 19.1 ఓవర్లలో కేవలం 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. డేవిడ్ మిల్లర్ ఓ స్ట్రెయిట్ సిక్సర్ తో మ్యాచ్ ను ముగించాడు. 

163 పరుగుల ఛేదనలో... గుజరాత్ ఓపెనర్లు వృద్ధిమాన్ సాహా (25), కెప్టెన్ శుభ్ మాన్ గిల్ (36) రాణించారు. వన్ డౌన్ లో వచ్చిన సాయిసుదర్శన్ 45 పరుగులు చేయగా, మిల్లర్ 44 పరుగులతో అజేయంగా నిలిచాడు. 

ఈ పోరులో ఏ దశలోనూ సన్ రైజర్స్ కు గెలుపు అవకాశాలు కనిపించలేదు. సన్ రైజర్స్ బౌలర్లలో షాబాజ్ అహ్మద్ 1, మయాంక్ మార్కండే 1, కమిన్స్ 1 వికెట్ తీశారు. భువనేశ్వర్ కుమార్, జయదేవ్ ఉనద్కట్, వాషింగ్టన్ సుందర్ ఒక్క వికెట్ కూడా తీయలేకపోయారు. సన్ రైజర్స్ హైదరాబాద్ తన తదుపరి మ్యాచ్ ను ఏప్రిల్ 5న చెన్నై సూపర్ కింగ్స్ తో ఆడనుంది. 

చెన్నై సూపర్ కింగ్స్ పై టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్

ఐపీఎల్ లో నేడు రెండో మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ ఢీకొంటున్నాయి. ఈ మ్యాచ్ కు విశాఖపట్నంలోని డాక్టర్ వైఎస్సార్ ఏసీఏ-వీడీసీఏ క్రికెట్ స్టేడియం వేదికగా నిలుస్తోంది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటింగ్ ఎంచుకుంది

More Telugu News