Chandrababu: ప్రజల్లో ఇంత కసి ఎప్పుడూ చూడలేదు.. అనుమానమే లేదు... గేమ్ ఈజ్ ఓవర్: ఎమ్మిగనూరులో చంద్రబాబు

  • కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో ప్రజాగళం సభ
  • వాడీవేడిగా ప్రసంగించిన చంద్రబాబు
  • ఈసారి ఎన్నికల్లో ఫ్యాన్ ముక్కలై చెత్త కుప్పలోకి పోతుందని ఎద్దేవా
  • కూటమి అన్ స్టాపబుల్ అంటూ ధీమా 
Chandrababu speech in Yemmiganur

టీడీపీ అధినేత చంద్రబాబు కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో ప్రజాగళం సభలో వాడీవేడిగా ప్రసంగించారు. నమ్మిన వాళ్లను నట్టేట ముంచిన వ్యక్తి జగన్ అని విమర్శించారు. ఈసారి ఎన్నికల్లో ఫ్యాన్ ముక్కలై చెత్త కుప్పలోకి పోతుందని అన్నారు. జగన్ ను ఓడించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని స్పష్టం చేశారు. 

ప్రజల్లో ఇంత కసి ఎప్పుడూ చూడలేదు అని వెల్లడించారు. ఇంత మధ్యాహ్నం వేళ ఎండను కూడా లెక్కచేయకుండా జనం వచ్చారు... ఈ మీటింగ్ చూశాక అనుమానమే లేదు... గేమ్ ఈజ్ ఓవర్... కూటమి అన్ స్టాపబుల్... ఎవరైనా అడ్డం వస్తే సైకిల్ (టీడీపీ) తొక్కుకుంటూ పోతుంది... గ్లాసు (జనసేన) కూడా ఎక్కడిక్కడ కుమ్మేసుకుంటూ పోతుంది... పువ్వు (బీజేపీ) కూడా కలుస్తుంది కాబట్టి ఆహ్లాదకరంగా ఉంటుంది... అని మూడు పార్టీల కూటమి గురించి చంద్రబాబు వివరించారు. 

జగన్ కు ఓటు వేస్తే మన నెత్తిన మనమే చెత్త వేసుకున్నట్టు అని అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో అభివృద్ధి జరిగిందా... రాష్ట్రంలో కరవు కనిపించడం లేదా? తాగడానికి నీళ్లు ఉన్నాయా? ఇక్కడ జగన్ కు బిందెలతో నిరసన తెలిపారు... అవునా, కాదా? అని చంద్రబాబు ప్రశ్నించారు. 

కానీ... అన్ని ఊళ్లకు నీళ్లిచ్చాను, నా ముద్ర ఉంది అని చెప్పుకుంటున్నాడు... ఏంటి నీ ముద్ర, ఎక్కడుంది నీ ముద్ర? తాగడానికి మంచి నీళ్లు ఇవ్వలేని నువ్వు ముద్ర గురించి మాట్లాడతావా? ఈ ప్రాంతంలో ఒక్క తట్ట మట్టి వేయని నువ్వు ముద్ర గురించి మాట్లాడతావా? అంటూ చంద్రబాబు ధ్వజమెత్తారు. 

"రాయలసీమలో 102 ప్రాజెక్టులు క్యాన్సిల్ చేశాడు. నేను గతంలో సీమ ప్రాజెక్టులకు రూ.12 వేల కోట్లు ఖర్చుపెడితే, ఇతడు ముష్టి రూ.2 వేల కోట్లు ఖర్చు పెట్టాడు. ఈ ప్రాంతానికి హెచ్ఎల్ సీ, గురు రాఘవేంద్ర, గుండ్రేవుల ప్రాజెక్టులే శరణ్యం. ఈ ప్రాంతానికి ఒక్క తుంగభద్ర తప్ప వేరే నీళ్లు రావు. అలాంటి ప్రాజెక్టులను నేను ముందుకు తీసుకెళితే, ఈ దుర్మార్గుడు అధికారంలోకి వచ్చాక ఒక్క పని కూడా చేయలేదు. 

ఈ ప్రాంతం నుంచి కూలీ పనుల కోసం బెంగళూరు, హైదరాబాద్, గుంటూరు, గోదావరి జిల్లాలకు వెళ్లే పరిస్థితి ఉంది. నేను మీకు అండగా ఉంటా. సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేస్తా... ఈ కర్నూలు జిల్లా దశ దిశ మార్చి మీ భవిష్యత్తును మార్చుతా. 

ఈ ఎమ్మిగనూరు గడ్డపై నుంచి చెబుతున్నా... జగన్ రాయసీమ ద్రోహి... ఒక్క ఓటు కూడా వేయొద్దు. ఈ ప్రాంతంలో అనేక వెనుకబడిన కులాల వారికి అభ్యర్థులుగా టికెట్లు ఇచ్చాం. టీడీపీ డీఎన్ఏలోనే బీసీ ఉంది. బీసీలను గుండెల్లో పెట్టుకునే పార్టీ టీడీపీ" అని స్పష్టం చేశారు.

More Telugu News