Virat Kohli: విరాట్ కోహ్లీ 83 పరుగులు కొట్టడానికి 59 బంతులు ఆడాడు.. భారత మాజీ క్రికెటర్ ఆసక్తికర వ్యాఖ్యలు

  • కోల్‌కతా బ్యాటర్లు పవర్ ప్లేలో 5.5 ఓవర్లలోనే 83 పరుగులు బాదారన్న ఆకాశ్ చోప్రా
  • బెంగళూరు బౌలర్లు తేలిపోయారని అభిప్రాయపడ్డ మాజీ క్రికెటర్
  • గత శుక్రవారం జరిగిన బెంగళూరు వర్సెస్ కోల్‌కతా మ్యాచ్‌పై చోప్రా విశ్లేషణ
Virat Kohli Played 59 Balls To score 83 runs says Ex India Star Akash Chopra

కోల్‌కతా నైట్‌రైడర్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ బ్యాటింగ్‌పై భారత మాజీ ఆటగాడు ఆకాశ్ చోప్రా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. 83 పరుగులు కొట్టడానికి కోహ్లీ 59 బంతులు ఆడాడని వ్యాఖ్యానించాడు. అయితే కోల్‌కతా బ్యాటర్లు సునీల్ నరైన్, వెంకటేశ్ అయ్యర్‌లు పవర్‌ప్లే‌లో కేవలం 5.5 ఓవర్లలోనే 83 పరుగులు బాదారని పోల్చాడు. సునీల్ నరైన్ బ్యాటింగ్‌లో స్పష్టమైన ఉద్దేశం ఉంటుందని, నువ్వా-నేనా అనేలా బ్యాటింగ్ చేస్తాడని ఆకాశ్ చోప్రా మెచ్చుకున్నాడు. పదే పదే బౌన్సర్లు, యార్కర్లు వేయాలని గ్రహించాలని, అలా చేయకపోతే మ్యాచ్ దూరమవుతుందని, బెంగళూరు జట్టుకి అదే పరిస్థితి ఎదురైందని ఆకాశ్ చోప్రా విశ్లేషించాడు. ఈ మేరకు తన యూట్యూబ్‌ ఛానెల్ లో మాట్లాడాడు.

ఇక కోల్‌కతా ఓపెనర్ ఫిల్‌సాల్ట్ కూడా అద్భుతమైన ఆరంభాన్ని అందించాడని ప్రశంసించాడు. కోల్‌కతా బౌలింగ్‌లో కూడా బాగా రాణించిందని పేర్కొన్నాడు. కోహ్లీ 59 బంతుల్లో 83 పరుగులు చేస్తే.. కోల్‌కతా 5.5 ఓవర్లలోనే 83 పరుగులు చేసిందని ప్రస్తావించాడు. బెంగళూరు బౌలర్లు అల్జారీ జోసెఫ్, మహ్మద్ సిరాజ్, యష్ దయాల్‌లను కోల్‌కతా బ్యాటర్లు చితక బాదారని పేర్కొన్నాడు. మరోవైపు కోల్‌కతా మెంటార్ గౌతమ్ గంభీర్‌ను కూడా ప్రశంసించాడు. నరైన్‌ను ఓపెనర్‌గా పంపడం, ఆండ్య్రూ రస్సెల్‌ను డెత్-ఓవర్ బౌలర్‌గా ప్రయోగించిన ఎత్తుగడలు బాగున్నాయని పేర్కొన్నాడు. 

కాగా గత శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా చేతిలో బెంగళూరు ఓటమిపాలైంది. కోహ్లీ వరుసగా రెండవ అర్ధ సెంచరీ నమోదు చేసినప్పటికీ.. ప్రత్యర్థి జట్టు కోల్‌కతా బ్యాటర్లు, సునీల్ నరైన్, వెంకటేష్ అయ్యర్‌ చెలరేగడంతో 180 పరుగుల పైచిలుకు ఆ జట్టు లక్ష్యాన్ని సునాయాసంగా ఛేదించింది.

More Telugu News