Virat Kohli-Gautam Gambhir: కోహ్లీ-గంభీర్ కలిసిపోయారు.. ఢిల్లీ పోలీసులు భలేగా ఉపయోగించుకున్నారు

  • గత సీజన్‌లో కలబడిన కోహ్లీ, గంభీర్
  • కేకేఆర్-ఆర్సీబీ మ్యాచ్‌లో చేతులు కలిపి ముచ్చటించుకున్న విరాట్-గౌతమ్
  • వీడియోను షేర్ చేసి సమస్యను ఇలా పరిష్కరించుకోవాలంటూ అవగాహన పెంచుతున్న వైనం
Delhi Police shares post following reconciliation between Kohli and Gambhir

ఉప్పునిప్పులా ఉండే విరాట్ కోహ్లీ, గౌతం గంభీర్ కలిసిపోయారు. ఇద్దరూ చేతులు కలుపుకొని మనసారా మాట్లాడుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ కాగా, ఢిల్లీ పోలీసులు కూడా దీనిని ఉపయోగించుకున్నారు. ఐపీఎల్‌లో భాగంగా శుక్రవారం బెంగళూరు (ఆర్సీబీ)-కోల్‌కతా (కేకేఆర్) మధ్య బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో వీరిద్దరూ చేతులు కలుపుకొని ఆప్యాయంగా మాట్లాడుకున్నారు. 

16వ ఓవర్ ముగిశాక స్ట్రాటజిక్ టైమ్ అవుట్ సమయంలో ఇద్దరూ కలుసుకున్నారు. ఇద్దరూ చేతులు కలుపుకొని హగ్ చేసుకున్నారు. నవ్వుతూ కాసేపు ముచ్చటించుకున్నారు. గత సీజన్‌లో కలబడిన ఇద్దరూ ఇప్పుడిలా చేతులు కలుపుకొని ఆప్యాయంగా మాట్లాడుకోవడం చూసి స్టేడియంలోని ప్రేక్షకులే కాదు.. టీవీలో మ్యాచ్‌ను వీక్షిస్తున్నవారు కూడా పొంగిపోయారు. 

ఇప్పుడీ వీడియోను ఢిల్లీ పోలీసులు చక్కగా ఉపయోగించుకున్నారు. వివాదాల పరిష్కారం విషయంలో ఈ వీడియోను ఉపయోగించుకుని అవగాహన పెంచే ప్రయత్నం చేశారు. ఈ వీడియోను సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో షేర్ చేసిన పోలీసులు.. గొడవ జరిగిందా? 112కు కాల్ చేయండి. గొడవను పరిష్కరించుకోండి. ఏ గొడవ అయినా విరాట్ (కోహ్లీ), గంభీర్ అంత పెద్దదేం కాదు. పరిష్కరించలేనంత తీవ్రమైనది కాదు.. అని ఆ వీడియోకు క్యాప్షన్ తగిలించారు.

More Telugu News