Chennai Super Kings: వైజాగ్‌లో ఐపీఎల్ ఫీవర్.. నేడు చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్

  • దాదాపు ఐదేళ్ల  విరామం తర్వాత విశాఖపట్నంలో తొలి ఐపీఎల్ మ్యాచ్
  • రాత్రి 8 గంటలకు ప్రారంభం కానున్న మ్యాచ్
  • బలంగా కనిపిస్తున్న చెన్నై సూపర్ కింగ్స్ జట్టు
Chennai Super Kings vs Delhi Capitals match in Visakapatnam Today

దాదాపు ఐదేళ్ల సుధీర్ఘ విరామం తర్వాత విశాఖపట్నం వేదికగా తొలి ఐపీఎల్ మ్యాచ్ జరగబోతోంది. చెన్నై సూపర్ కింగ్స్, వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు తలపడబోతున్నాయి. ఈ సీజన్‌లో 2 మ్యాచ్‌ల కోసం విశాఖను ఢిల్లీ క్యాపిటల్స్ వేదికగా ఎంచుకుందన్న విషయం తెలిసిందే. దీంతో వైఎస్సార్‌ ఏసీఏ వీడీసీఏ స్టేడియం వేదికగా రాత్రి 8 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. ఇక వచ్చే బుధవారం మరో మ్యాచ్ ఇక్కడ జరగనుంది. ఈ మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్‌తో ఢిల్లీ క్యాపిటల్స్ తలపడనుంది. ఇక చివరిసారిగా 2019లో ఢిల్లీ, చెన్నై జట్ల ఇక్కడ మ్యాచ్ జరిగింది. అంతకుముందు 2012, 2015, 2016, 2019 సీజన్లలోనూ పలు మ్యాచ్‌లకు వైజాగ్ ఆతిథ్యం ఇచ్చింది.

ఇక నేటి మ్యాచ్ విజయానికి వస్తే చెన్నై సూపర్ కింగ్స్ వరుస విజయాలతో మంచి దూకుడు మీద కనిపిస్తోంది. ఇప్పటివరకు ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ చెన్నై తిరుగులేని విజయం సాధించింది. చెన్నై టీమ్ బలంగా కనిపిస్తోంది. శివమ్‌ దూబె, రచిన్‌ రవీంద్ర అద్భుతమైన ఫామ్‌లో ఉన్నారు. మరోవైపు బౌలింగ్‌లో ముస్తాఫిజుర్‌, దీపక్‌ చాహర్‌ రాణిస్తుండడంతో ఆ జట్టు సమతుల్యంగా కనిపిస్తోంది. మరోవైపు ఢిల్లీ క్యాపిటల్స్ పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. ఆడిన తొలి రెండు మ్యాచ్‌ల్లోనూ ఆ జట్టు ఓటమిపాలైంది. ఇరు జట్ల మధ్య ట్రాక్ రికార్డు విషయానికి వస్తే గత నాలుగు మ్యాచ్‌ల్లోనూ చెన్నై చేతిలో ఢిల్లీ ఓడిపోయింది. కాగా ధోనీ ఆటను ఆస్వాదించేందుకు పెద్ద ఎత్తున అభిమానులు పోటెత్తే అవకాశం ఉంది.

More Telugu News