Chandrababu: నా చదువు గురించి జగన్ మాట్లాడుతున్నాడు... ఇప్పుడు నేను అడుగుతున్నా!: చంద్రబాబు

  • నాయుడుపేటలో చంద్రబాబు ప్రజాగళం సభ
  • ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చేందుకే తాను ఇక్కడికి వచ్చానని వెల్లడి
  • జగన్... ఇంతకీ నువ్వేం చదివావు? అంటూ చంద్రబాబు ఎదురుదాడి
  • కొత్తగా కంటైనర్ డ్రామాకి తెరలేపారని వ్యాఖ్యలు
Chandrababu satires on CM Jagan Mohan Reddy

టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు ఈ సాయంత్రం తిరుపతి జిల్లా నాయుడుపేటలో ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్నారు. ప్రజాగళం యాత్రలో భాగంగా నిర్వహించిన ఈ సభలో చంద్రబాబు సీఎం జగన్ పై ధ్వజమెత్తారు. వైసీపీ ప్రభుత్వంపై ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చేందుకే తాను ఇక్కడికి వచ్చానని వెల్లడించారు. ఒక్కమాటలో చెప్పాలంటే ఇలాంటి దుర్మార్గుడ్ని చిత్తు చిత్తుగా ఓడించి, ప్యాకప్ చేసి పంపించేయాలని పిలుపునిచ్చారు. 

జగన్ మోహన్ రెడ్డీ... నువ్వేం చదివావు?

నా వయసు గురించి మాట్లాడుతున్నాడు. నేనొక మాట చెప్పా. నా మాదిరిగా రెండు గంటల సేపు ఎండలో నిలుచుని మీటింగ్ చెప్పు... నీ కథేంటో తేలుతుంది అని చెప్పా. నా చదువు గురించి కూడా మాట్లాడుతున్నాడు. నేను చెప్పా... ఎంఏ చదివా, వెంకటేశ్వర యూనివర్సిటీలో చదివా, 1974లో చదివా, ఆర్థికశాస్త్రంతో చదివా. 

ఇప్పుడు నేను అడుగుతున్నా... జగన్ మోహన్ రెడ్డీ నువ్వు ఎక్కడ చదివావు? ఎక్కడ డిగ్రీ వచ్చింది నీకు? మీకు తెలుసా జగన్ ఏ యూనివర్సిటీలో చదివాడో... దాని పేరు రహస్య యూనివర్సిటీ! ఇలాంటి ఫేక్ ఫెలోస్ నా గురించి మాట్లాడుతున్నారు.

ఇప్పుడు కంటైనర్ డ్రామా చూస్తున్నారు

బాబాయ్ గొడ్డలివేటు చూశారు, కోడికత్తి డ్రామా చూశారు, ఇప్పుడు కంటైనర్ డ్రామా చూస్తున్నారు. కంటైనర్ పెట్టి ఇంట్లో నుంచి ఇసుక డబ్బులు, మద్యం డబ్బులు పంపించారు. గ్రామాల్లో అప్పుడే స్టాక్ పెట్టేశారు. ఒక్కో నియోజకవర్గానికి రూ.20 కోట్లు, రూ.30 కోట్లు పెట్టి డబ్బులు పంపించి, మద్యం మత్తెక్కించి ఓట్లు సంపాదించాలనుకుంటున్నారు.

మీ ఆటలు సాగవు... ప్రజల్లో చైతన్యం వచ్చింది. ఇంటికి ఒకరు బయటికి రావాలి, మీ ఇంటిపై టీడీపీ జెండా ఎగరాలి, ఎన్డీయే అభ్యర్థులు గెలవాలి, ఈ రాష్ట్రం వెలగాలి, ప్రజలు గెలవాలి, రాష్ట్రం నిలబడాలి అని మిమ్మల్నందరినీ కోరుతున్నాను" అని చంద్రబాబు విజ్ఞప్తి చేశారు.

More Telugu News