Revanth Reddy: చంద్రబాబు డైరెక్షన్‌లోనే రేవంత్ రెడ్డి ఇదంతా చేస్తున్నారు: బీఆర్ఎస్ నేత ఎర్రోళ్ల శ్రీనివాస్

  • కేసీఆర్‌ను ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారని ఆగ్రహం
  • కడియం శ్రీహరి కారణంగా ముగ్గురు పార్టీని విడిచి పెట్టారని మండిపాటు
  • వెంటిలెటర్ మీద ఉన్న కేకే, కడియంలకు కేసీఆర్ ఆక్సిజన్ ఇచ్చి బతికిస్తే మోసం చేశారన్న శ్రీనివాస్
  • తెలంగాణలో తెలుగు తమ్ముళ్ల పునరేకీకరణ జరుగుతోందని ఎద్దేవా
Revanth reddy under chandrababu direction

టీడీపీ అధినేత చంద్రబాబు డైరెక్షన్‌లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.... తమ పార్టీ అధినేత కేసీఆర్‌ను ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారని బీఆర్ఎస్ నేత ఎర్రోళ్ల శ్రీనివాస్ అన్నారు. శనివారం తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ... కొంతమంది నేతలు అవకాశవాదంతో పార్టీ మారుతున్నారని ఆరోపించారు. వరంగల్ నుంచి సిట్టింగ్‌ను కాదని కడియం శ్రీహరి మీద గౌరవంతో ఆయన కూతురుకు టిక్కెట్ ఇస్తే పార్టీ వీడుతున్నారని మండిపడ్డారు. కడియం కావ్యకు కేసీఆర్‌ను తప్పుపట్టే స్థాయి లేదన్నారు.

పార్టీ మారిన నేతలు తమ పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కే కేశవరావు, కడియం శ్రీహరి పార్టీ మారుతుంటే సిగ్గేస్తోందన్నారు. వెంటిలెటర్ మీద ఉన్న ఈ నాయకులకు కేసీఆర్ ఆక్సిజన్ అందించి బతికించారని వ్యాఖ్యానించారు. వారు పక్కా ప్రణాళిక ప్రకారం పార్టీని మోసం చేశారని ఆరోపించారు. కడియం శ్రీహరి వల్ల రాజయ్య, పసునూరి దయాకర్, ఆరూరి రమేశ్ పార్టీకి దూరమయ్యారని మండిపడ్డారు. ఇన్నేళ్ల తన అనుభవాన్ని కడియం శ్రీహరి చిల్లర రాజకీయాల కోసం వాడుకున్నారని విమర్శించారు.

పదవులను అనుభవించి కష్ట సమయంలో పార్టీని విడిచి వెళ్లడం సమంజసం కాదన్నారు. రాజీనామా చేయకుండా ఇతర పార్టీలలో చేరే ఎమ్మెల్యేలను రాళ్లతో కొట్టాలని గతంలో సీఎం రేవంత్ రెడ్డి అన్నారని గుర్తు చేశారు. వారిని రాళ్లతో కొట్టించే బాధ్యతను ముఖ్యమంత్రి తీసుకోవాలని వ్యాఖ్యానించారు. టీడీపీ మాస్క్ వేసుకొని కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తోందన్నారు. గతంలో టీడీపీలో ఉన్నవారంతా ఒకే వేదికపైకి వస్తున్నారన్నారు. అది రాజకీయ పునరేకీకరణ కాదని... తెలుగు తమ్ముళ్ల పునరేకీకరణ అని ఎద్దేవా చేశారు. పార్టీ అధినేత కేసీఆర్ ఆదేశిస్తే తాను వరంగల్ నుంచి ఎంపీగా పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు.

More Telugu News