Chandrababu: వచ్చేది తుపాను... ఫ్యాన్ గిలగిలా కొట్టుకోవడం ఖాయం: కావలిలో చంద్రబాబు

  • నెల్లూరు జిల్లాలో టీడీపీ ప్రజాగళం ఎన్నికల ప్రచారం
  • కావలి సభలో చంద్రబాబు వాడీవేడి ప్రసంగం
  • ఎన్డీయే కూటమి గెలుపు ఖాయం అని చంద్రబాబు ధీమా
  • వైసీపీ అభ్యర్థులకు డిపాజిట్లు గల్లంతు అని ఎద్దేవా
  • ఇలాంటి సీఎం వస్తాడని ఎప్పుడూ అనుకోలేదని వ్యాఖ్యలు
Chandrababu speech in Kavali Praja Galam rally

టీడీపీ అధినేత చంద్రబాబు నెల్లూరు జిల్లా కావలిలో ప్రజాగళం సభలో పాల్గొన్నారు. నెల్లూరు లోక్ సభ స్థానం టీడీపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కావలి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి  కావ్య వెంకట కృష్ణారెడ్డి కూడా ఈ సభకు హాజరయ్యారు. ఈ సభలో చంద్రబాబు ప్రసంగిస్తూ, ప్రజల ఉత్సాహం చూస్తుంటే ఎన్డీయే గెలుపు ఖాయంగా కనిపిస్తోందని అన్నారు. వైసీపీ నేతలకు డిపాజిట్లు కూడా రావని ఎద్దేవా చేశారు. 

ఇవాళ టీడీపీ 42వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటున్నామని, ఎన్టీఆర్... టీడీపీని స్థాపించిన గొప్ప రోజు ఇది అని అభివర్ణించారు. ఈ 42 ఏళ్లలో తెలుగువారిని ప్రపంచం మొత్తం పరిచయం చేశామని చెప్పారు. అనేక విజయాలు సాధించామని, జాతీయ స్థాయిలో ప్రతిపక్షంగా పనిచేయడమే కాకుండా, ప్రభుత్వాల ఏర్పాటుతో ముందుకు పోయామని చంద్రబాబు వివరించారు. హైదరాబాద్ నగరాన్ని బ్రహ్మాండంగా అభివృద్ధి చేసి తెలుగుజాతికి తిరుగులేదని నిరూపించగలిగాం అని తెలిపారు. 

"కానీ ఈ ఐదేళ్లలో ప్రతి ఒక్కరూ కష్టాలు పడుతున్నారు. అందుకే ప్రజలను చైతన్యవంతులను చేయడానికి ప్రజాగళం పేరిట ఇక్కడికి వచ్చాను. ప్రజలు గళం విప్పాలని చెప్పడానికి వచ్చాను. రైతులు పరిస్థితులు బాగున్నాయా? మహిళలకు రక్షణ ఉందా? ఈ దుర్మార్గుడు తన పాలనలో రూ.10 ఇచ్చి రూ.100 దోచుకుంటున్నాడు, మీ రక్తాన్ని జలగ మాదిరిగా తాగేస్తున్నాడు. 

అన్ని ధరలు పెంచేశారు, చెత్త మీద కూడా ఈ చెత్త ముఖ్యమంత్రి పన్ను వేశాడు. ప్రజల ఆదాయం కంటే ఖర్చులు పెరిగాయి. ప్రజల జీవన ప్రమాణాలు పడిపోయాయి. యువతకు ఉద్యోగాలు వచ్చాయా? జాబ్ క్యాలెండర్ ఏమైంది? డీఎస్సీ జరుగుతుందా? జాబ్ రావాలంటే బాబు రావాలి. ఈ ఐదేళ్లలో అందరూ నష్టపోయారు. ఆ విషయాన్ని చెప్పడానికి, గుర్తుచేయడానికి ఇక్కడికి వచ్చాను. మీ అభివృద్ధి, మీ సంక్షేమం నా బాధ్యత అని చెప్పడానికి వచ్చాను. 

ఇచ్ఛాపురం నుంచి మంత్రాలయం వరకు జగన్ ను ఇంటికి పంపడానికి సిద్ధమైపోయారు. ఈ ప్రజావ్యతిరేక తుపాను మాదిరిగా వస్తోంది. ఈ తుపాను తాకిడికి ఫ్యాను గిలగిలా కొట్టుకుంటుంది. చివరికి ఫ్యాను డస్ట్ బిన్ లో చేరుకుంటుంది. 

45 ఏళ్లుగా నేను రాజకీయాల్లో ఉన్నాను. అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా ఉన్నది నేనే. నా జీవితకాలంలో ఇలాంటి ముఖ్యమంత్రి వస్తాడని నేను ఊహించలేదు. జగన్ ప్రజాస్వామ్యంపై నమ్మకం లేదు, చట్టంపై గౌరవం లేదు, వ్యవస్థలపై విశ్వాసం లేదు. అతడికి తెలిసిందల్లా దోపిడీ, దోచుకున్న డబ్బుతో అక్రమాలు చేయడం, ఆ డబ్బులతో ప్యాలెస్ లు కట్టుకోవడం, మీడియా, వ్యవస్థలను మేనేజ్ చేయడం, పేటీఎం బ్యాచ్ లను మనపై పురికొల్పడం. 

జగన్ ను ఎవరూ అడగకూడదు... అతడు ఆకాశం నుంచి ఊడిపడ్డాడు... ఆయన ఏ తప్పు చేసినా మనం భరించాలి. ఎవరైనా ఎదురుతిరిగితే వారిని పూర్తిగా నాశనం చేసేందుకు కంకణం కట్టుకుని పనిచేశాడు. ప్రజలు, ప్రజా సంఘాలు, ఉద్యోగ సంఘాలు, రాజకీయ నేతలు.. అందరినీ అణగదొక్కాడు. ఎవరైనా రోడ్డుపైకి వచ్చి పోరాడగలిగారా? 

ఎవరైనా ప్రశ్నిస్తే పోలీసులు వస్తారు, ఆ తర్వాత సీబీసీఐడీ వాళ్లు వస్తారు... అరెస్ట్ చేస్తారు... జైల్లో పెడతారు... ఈ పోలీసుల్లో కొంతమంది జైల్లో కొడతారు, టార్చర్ పెడతారు... చంపేయడానికి కూడా ప్రయత్నిస్తారు. కేసులు పెట్టి వేధించారు. వీళ్ల దాష్టీకాలకు తట్టుకోలేక కొందరు ఆత్మహత్యలు చేసుకుని చనిపోయారు. 

ఇక బాబాయ్ ని చంపారు. బాబాయ్ ది గొడ్డలివేటా, లేక సహజమరణమా? చంపిన వ్యక్తికి ఎంపీ సీటు ఇచ్చి మళ్లీ ఊరేగుతున్నారు. ఈయన చెల్లెలు ఇప్పుడు ఎలుగెత్తుతోంది. మా నాన్నను చంపిన వాళ్లపై కేసులు పెట్టండి, ఏం జరిగిందో ప్రపంచానికి తెలియజేయండి, మా నాన్న ఆత్మకు శాంతి కలిగించండి అని అడిగితే, ఆడబిడ్డపై కేసులు పెట్టే స్థాయికి వచ్చారు. ఇదంతా చూసిన తర్వాత మీకు రక్షణ ఉందా అని ప్రజలను అడుగుతున్నా. ప్రజల ఆస్తులకు రక్షణ ఉందా? కృష్ణపట్నం పోర్టు ఏమైందో చూశాం. 

ఈ ప్రభుత్వాన్ని చిత్తు చిత్తుగా ఓడించి, ఈ ముఖ్యమంత్రి రాజకీయాల్లో లేకుండా చేస్తే మనందరం బాగుపడతాం. ఇవాళ ఈ ముఖ్యమంత్రి కొత్త వేషం వేసుకుని వచ్చాడు. మొన్నటి వరకు తాడేపల్లిలో ఉండేవాడు. మొన్నటి వరకు పరదాలు కట్టుకుని తిరిగాడు. ఇప్పుడు బుల్లెట్ ప్రూఫ్ బస్సులో తిరుగుతున్నాడు. ఆ బస్సు మొత్తం బుల్లెట్ ప్రూఫ్. అందులోంచి దిగకుండానే మేము సిద్ధం అంటున్నాడు. 

నేను పేదల మనిషిని, మిగతా అందరూ పెత్తందార్లు అంటున్నాడు ఈ ముఖ్యమంత్రి. అందుకే ఈ ముఖ్యమంత్రికి కొన్ని ప్రశ్నలు వేస్తున్నా. పేదల కోసం రూ.5కే అన్నం పెట్టే అన్న క్యాంటీన్లను ఏర్పాటు చేసినవాళ్లు పెత్తందార్లా? లేక, అధికార దాహంతో అన్న క్యాంటీన్లను రద్దు చేసినవాళ్లు పెత్లందార్లా? 

మన పిల్లలు ఏ యూనివర్సిటీలో చదువుకోవాలన్నా డబ్బులు ఇచ్చాను. మేం పెత్తందారులమా, లేక విదేశీ విద్య పథకం నిలిపివేసినవాళ్లు పెత్తందార్లా? ప్రతి ఒక్కరికీ ఇల్లు ఉండాలని, 12 లక్షల టిడ్కో ఇళ్లు తీసుకువస్తే, ఐదేళ్లుగా టిడ్కో ఇళ్లు ఇవ్వకుండా రంగులు వేసుకుని పెత్తనం చేసేవాళ్లు మీరు పెత్తందార్లు కాదా? 

మేం ప్రతి ఇంటికి రూ.3 లక్షలు ఇచ్చాం, కానీ ఇతడు రూ.500 కోట్లతో రుషికొండలో విలాసవంతమైన ప్యాలెస్ కట్టుకున్నాడు. ఈ సందర్భంగా చెబుతున్నా... ఇప్పటివరకు ఇచ్చిన ఇంటి కాలనీలు రద్దు చేయం. ఇంకా డబ్బులు ఇచ్చి మీరు ఇల్లు కట్టుకోవడానికి పూర్తిగా సహకరిస్తాను. నేను సైకో జగన్ లాంటి వాడ్ని కాను. 

ఎస్సీల కోసం 27 పథకాలు ఇచ్చాం...  వాటిని రద్దు చేశాడు. ఆ పథకాలు ఇచ్చిన మేం పెత్తందారులమా? ఆ 27 పథకాలు రద్దు చేసిన వ్యక్తి పెత్తందారుడా? పేద పిల్లలకు ఫీజు రీయింబర్స్ మెంట్ ఇచ్చాం... ఇప్పుడీ ఫీజు రీయింబర్స్ మెంట్ తీసేశారు. ఇప్పుడు చెప్పండి... మేం పెత్తందారులమా? ఫీజు రీయింబర్స్ మెంట్ రద్దు చేసిన జగన్ పెత్తందారుడా?

ప్రజలందరి ఆదాయాలు తగ్గిపోతున్నాయి, జగన్ ఆదాయాలు మాత్రమే పెరుగుతూనే ఉన్నాయి. దేశంలో తలసరి అప్పుల్లో ఏపీ నెంబర్ వన్ గా ఉంది, ఆత్మహత్యల్లో ఏపీ నెంబర్ వన్ గా ఉంది. జగన్ మాత్రం విలాసవంతమైన ఇళ్లు కట్టుకోవడంలో నెంబర్ వన్ గా ఉన్నాడు. అందుకే ఇవాళ నేను ఒక్కటే కోరుతున్నా... ప్రజలారా సిద్ధం కండి. జగన్... నిన్ను, నీ కుర్చీని కూలదోయడానికి ప్రజలు సిద్ధం" అంటూ చంద్రబాబు ప్రసంగించారు.

More Telugu News