BJP: రెండో, మూడో ఫోన్ ట్యాపింగ్‌లు జరిగుండొచ్చని కేటీఆర్ అన్నారు... దీనిపై రేవంత్ రెడ్డి విచారణ జరిపించాలి: బీజేపీ నేత లక్ష్మణ్

  • కేంద్ర హోంశాఖ అనుమతి లేకుండానే ఫోన్ ట్యాపింగ్ చేశారని విమర్శ
  • తెలంగాణలో ప్రభుత్వం మారడంతో హార్డ్ డిస్క్‌లు, సమాచారాన్ని ధ్వంసం చేశారన్న బీజేపీ నేత
  • కేసీఆర్ ఎవరినీ నమ్మలేదని, అందుకే ఫోన్ ట్యాపింగ్ చేయించారని వ్యాఖ్య
  • రేవంత్ రెడ్డి ఈ అంశంపై స్పందించి సీబీఐ విచారణ జరిపించాలని విజ్ఞప్తి
  • అసెంబ్లీ ఎన్నికల్లో ఓడించినా బీఆర్ఎస్ నేతలు అహంకారాన్ని వీడలేదని ఆగ్రహం
BJP leader Laxman fires at kcr over phone tapping issue

రెండో, మూడో ఫోన్ ట్యాపింగ్‌లు జరిగితే జరిగుండొచ్చని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అంటున్నారని, ఇందుకు ముఖ్య కారకులు కేసీఆర్, కేటీఆర్ కాబట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ అంశంపై స్పందించి సీబీఐ విచారణ జరిపించాలని బీజేపీ రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కె.లక్ష్మణ్ కోరారు. హైదరాబాద్‌లో గురువారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ... కేంద్ర హోంశాఖ అనుమతి లేకుండానే ఫోన్ ట్యాపింగ్ చేశారని విమర్శించారు. తెలంగాణలో ప్రభుత్వం మారడంతో హార్డ్ డిస్క్‌లు, సమాచారాన్ని ధ్వంసం చేశారన్నారు. కేసీఆర్ ఎవరినీ నమ్మలేదని అందుకే ఫోన్ ట్యాపింగ్ చేయించారని పేర్కొన్నారు. రాజకీయ, మీడియా ప్రముఖులపై ఫోన్ ట్యాపింగ్ చేయించారన్నారు.

కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే పలువురి ఫోన్ ట్యాప్ చేశారని, అసెంబ్లీ, ఉప ఎన్నికల సమయంలో రాజకీయంగా లబ్ధి పొందే ప్రయత్నం చేశారని ఆరోపించారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కొంతమంది పోలీసు అధికారులు ఏ రకంగా అక్రమాలకు పాల్పడి ఆర్జించారో వెల్లడవుతోందన్నారు. ఫోన్ ట్యాపింగ్ ద్వారా కేసీఆర్ పౌరుల వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగించారని మండిపడ్డారు. ఫోన్ ట్యాపింగ్, కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకల్లో కేసీఆర్ కుటుంబం పాత్ర ఉందన్నారు. కవిత మద్యం కేసులో అరెస్టయ్యారని గుర్తు చేశారు. తెలంగాణ సంపదను దోచుకున్న వారికి శిక్ష పడాల్సిందే అన్నారు.

కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఫామ్ హౌస్ నుంచి కదల్లేదని విమర్శించారు. ఒక్కసారి కూడా సచివాలయానికి వెళ్లలేదని మండిపడ్డారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో అన్ని పథకాల్లో కుంభకోణాలు, కమీషన్లు నడిచాయన్నారు. ప్రశ్నించిన వారిని బెదిరింపులకు గురి చేశారన్నారు. నియంతృత్వపోకడ కనిపించిందన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడించినా బీఆర్ఎస్ నేతలు మాత్రం అహంకారాన్ని వీడటం లేదన్నారు.

More Telugu News