DSC: అధికారంలోకి వస్తే తొలిరోజే మెగా డీఎస్సీపై సంతకం చేస్తాం: చంద్రబాబు

  • నేడు కుప్పంలో యువతతో చంద్రబాబు సమావేశం
  • డీఎస్సీ అభ్యర్థులకు టీడీపీ అధినేత భరోసా
  • అధికారంలోకి వచ్చిన 60 రోజుల్లో డీఎస్సీ ఉంటుందని వెల్లడి
  • ఎన్ని పోస్టులు ఖాళీ ఉంటే అన్ని పోస్టులతో డీఎస్సీ ఉంటుందని స్పష్టీకరణ
Chandrababu assures Mega DSC to youth

టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నేడు కుప్పంలో యువతతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మెగా డీఎస్సీపై యువతకు భరోసా ఇచ్చారు. ఎన్డీయే కూటమి అధికారంలోకి వచ్చాక తొలి రోజే డీఎస్సీపై సంతకం చేస్తామని స్పష్టం చేశారు. అధికారం చేపట్టిన 60 రోజుల్లో డీఎస్సీ ఉంటుందని అన్నారు. రాష్ట్రంలో ఎన్ని ఖాళీలు ఉంటే అన్నీ ఖాళీలతో మెగా డీఎస్సీ నిర్వహిస్తామని చంద్రబాబు పేర్కొన్నారు.

"మీరు (యువత) వెళ్లి  ఎన్నికల సంఘాన్ని కలవండి. ఇప్పుడు డీఎస్సీ వద్దు అని చెప్పండి. ఎన్నికలు అయ్యాకే డీఎస్సీ జరపాలని కోరండి. మేం కూడా ఎన్నికల సంఘాన్ని కలిసి డీఎస్సీ గురించి మాట్లాడతాం" అని పేర్కొన్నారు. 

గతంలో టీడీపీ 1.50 లక్షల ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేసిందని చంద్రబాబు వివరించారు. ఇప్పటివరకు అదే రికార్డ్ అని, మళ్లీ అలాంటి రికార్డునే సృష్టిస్తామని చెప్పారు. తాము మెగా డీఎస్సీనే జరుపుతామని, గతంలో ఎన్నడూ లేనంత భారీ స్థాయిలో డీఎస్సీ నిర్వహిస్తామని చంద్రబాబు సభాముఖంగా ప్రకటించారు. 

ప్రస్తుత ప్రభుత్వం ఐదేళ్లలో ఒక్కసారి కూడా డీఎస్సీ నిర్వహించలేదని మండిపడ్డారు. మీ జీవితాలను అంధకారం చేసిన జలగను ఇంటికి పంపాలని పిలుపునిచ్చారు.

More Telugu News