Nara Lokesh: దయచేసి ఆ రెండింటి జోలికి వెళ్లొద్దు: నారా లోకేశ్

  • సీఏఏకి అనుకూలంగా ఓటేసింది వైసీపీ ఎంపీలేనన్న నారా లోకేశ్
  • ఇప్పుడు టీడీపీపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం
  • సీఏఏ వస్తే మైనారిటీలు దేశం విడిచి వెళ్లాలనేది ఒక ఫేక్ న్యూస్ అని వెల్లడి
  • సాక్షి పేపర్, సాక్షి టీవీ ఆరోగ్యానికి హానికరం అని వ్యాఖ్యలు
Nara Lokesh says do not trust fake news on CAA

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మంగళగిరి నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.... నాడు సీఏఏకి అనుకూలంగా సంపూర్ణ మద్దతు పలికింది జగన్ పార్టీ ఎంపీలేనని అన్నారు. ఇప్పుడు టీడీపీపై వారే తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. 

"ఇప్పుడు నెల్లూరు ఎంపీగా విజయసాయిరెడ్డి పోటీ చేస్తున్నారు. జగన్ కేసులన్నింటిలో ఆయన ఏ2. ఆయన రాజ్యసభలో మాట్లాడుతూ, సీఏఏకి మేం సంపూర్ణ మద్దతు తెలుపుతున్నాం అని చెప్పాడు. సీఏఏ గురించి వారికి ఆనాడు తెలియదా? ఆ చట్టం గురించి సందేహాలు ఉంటే ఎందుకు అనుకూలంగా ఓటేశారు? ఇప్పుడెందుకు దుష్ప్రచారం చేస్తున్నారు? 

సీఏఏ వల్ల మైనారిటీ సోదరులు భారతదేశం వదిలి వెళ్లిపోవాల్సి వస్తుందని ఎవరు చెప్పారు? ఏ పేపర్ చెప్పింది? సాక్షి పేపర్ చదివితే ఆరోగ్యానికే హానికరం. సాక్షి టీవీ చూస్తే మనకు గుండెపోటు కూడా వస్తుంది... దయచేసి ఆ రెండింటి జోలికి వెళ్లొద్దు. 

సీఏఏ గురించి దుష్ప్రచారాన్ని ఎవరూ నమ్మొద్దు. మైనారిటీలు దేశం విడిచి వెళ్లాల్సి ఉంటుందనేది ఒక ఫేక్ న్యూస్. మోదీ చెప్పలేదు, చంద్రబాబు చెప్పలేదు, పవనన్న చెప్పలేదు.  ఈ విషయంలో కూటమి పెద్దలతో సరైన వేదికపై హామీ ఇప్పించే బాధ్యత నాది" అని నారా లోకేశ్ హామీ ఇచ్చారు.

More Telugu News