USA: ర‌ష్యాపై ఉగ్ర‌దాడిలో ఉక్రెయిన్ ప్ర‌మేయంపై అమెరికా క్లారిటీ

  • మాస్కోలో న‌ర‌మేధానికి, ఉక్రెయిన్‌కు ఎలాంటి సంబంధం లేద‌ని అమెరికా స్పష్టీకరణ  
  • ఉక్రెయిన్‌కు ప్ర‌మేయం ఉంద‌న‌డానికి ఎటువంటి ఆధారాలు కూడా లేవ‌న్న అగ్ర‌రాజ్యం
  • ఉగ్ర‌దాడికి పాల్ప‌డింది ఐసిస్ సంస్థేన‌ని పుతిన్ తెలుసుకున్నారన్న వైట్ హౌస్  
 White House press secretary Karine Jean Pierre Clarity on Mosco Terror Attack

ర‌ష్యా రాజ‌ధాని మాస్కోలో ఈ నెల 22వ తేదీ రాత్రి ఉగ్ర‌వాదులు న‌ర‌మేధానికి పాల్ప‌డిన విష‌యం తెలిసిందే. క్రాక‌స్ సిటీ క‌న్స‌ర్ట్ హాల్‌లోకి ఆయుధాల‌తో ప్ర‌వేశించిన ఉగ్ర‌వాదులు విచ‌క్ష‌ణ‌ర‌హితంగా కాల్పుల‌కు పాల్ప‌డ్డారు. ఈ దాడిలో 130 మందికి పైగా మృత్యువాత ప‌డ్డారు. తాజాగా మాస్కోలో జ‌రిగిన ఉగ్ర‌దాడితో ఉక్రెయిన్‌కు ఎలాంటి సంబంధం లేద‌ని అమెరికా స్ప‌ష్టం చేసింది. అంతేగాక ఉక్రెయిన్‌కు ప్ర‌మేయం ఉంద‌న‌డానికి ఎటువంటి ఆధారాలు కూడా లేవ‌ని వివ‌రించింది. 

ఈ నేప‌థ్యంలో మంగ‌ళ‌వారం శ్వేత‌సౌధం ప్రెస్ సెక్ర‌ట‌రీ క‌రీన్ జీన్ పియ‌ర్ మీడియాతో మాట్లాడుతూ.. "ఉగ్ర‌దాడికి పాల్ప‌డింది ఐసిస్ సంస్థేన‌ని ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్ తెలుసుకున్నారు. ఈ విష‌యం ఆయ‌న‌కు స్ప‌ష్టంగా తెలుసు. ఈ దాడితో ఉక్రెయిన్ ప్ర‌భుత్వానికి ఎటువంటి సంబంధం లేదు. అందుకు త‌గిన ఆధారాలు కూడా లేవు" అని ఆమె తెలిపారు. 

మాస్కో న‌ర‌మేధాన్ని అమెరికా ఇప్ప‌టికీ ఖండిస్తూనే ఉంద‌ని ఈ సంద‌ర్భంగా సెక్ర‌ట‌రీ చెప్పారు. దీనికి పూర్తి బాధ్య‌త ఐసిస్‌దేన‌ని ఆమె వ్యాఖ్యానించారు. మార్చి 7వ తేదీనే రష్యాలోని అమెరికా పౌరుల‌కు దాడిపై అడ్వైజ‌రీ జారీ చేశామ‌ని గుర్తు చేశారు.  

ఇక ఈ దాడికి పాల్ప‌డింది తామేన‌ని ఉగ్ర‌వాద సంస్థ ఐసిస్ ప్ర‌టించిన విష‌యం తెలిసిందే. దీనిని అమెరికా సైతం ధ్రువీకరించింది. అయితే, ఈ ఉగ్ర‌దాడితో ఉక్రెయిన్‌కు సంబంధం ఉంద‌ని ర‌ష్యా అధ్య‌క్షుడు పుతిన్ ఆరోపించారు. దాడి త‌ర్వాత నిందితులు ఉక్రెయిన్‌కు పారిపోయేందుకు ప్ర‌య‌త్నించార‌ని ఆయ‌న తెలిపారు. కాగా, పుతిన్ వ్యాఖ్య‌ల‌ను ఉక్రెయిన్ తీవ్రంగా ఖండించింది. ఇప్పుడు అమెరికా కూడా ఇదే విష‌య‌మై మ‌రోసారి క్లారిటీ ఇచ్చింది.

More Telugu News