Arvind Kejriwal: ఈడీ కస్టడీ నుంచి సీఎంగా రెండోసారి ఆదేశాలు జారీ చేసిన కేజ్రీవాల్

  • ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఈడీ కస్టడీలో ఉన్న కేజ్రీవాల్
  • ఇటీవలే నీటి సమస్య గురించి తొలి ఉత్తర్వులు ఇచ్చిన కేజ్రీ
  • తాజాగా ఉచిత ఔషధాల గురించి మరోసారి ఆదేశాలు జారీ
CM Kejriwal passes orders for second time from ED custody

ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఈడీ కస్టడీలో ఉన్న ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్... ఈడీ కార్యాలయం నుంచే ముఖ్యమంత్రిగా మరోసారి ఆదేశాలు జారీ చేశారు. మొహల్లా క్లినిక్ లలో ఉచిత ఔషధాల కొరత ఉండకుండా చూసుకోవాలని ఆయన ఆదేశించారు. ఈ విషయాన్ని ఢిల్లీ ఆరోగ్య మంత్రి సౌరభ్ భరద్వాజ్ వెల్లడించారు. కస్టడీలో ఉన్నప్పటికీ సీఎం కేజ్రీవాల్ ప్రజల ఆరోగ్యం గురించి ఆలోచిస్తున్నారని ఆయన అన్నారు. 

మరోవైపు ఈడీ కస్టడీ నుంచే కేజ్రీవాల్ పాలన సాగిస్తుండటం చర్చనీయాంశంగా మారింది. నీటి సమస్య గురించి సహచర మంత్రి ఆతిశీకి ఆయన నోట్ ద్వారా ఇటీవల ఉత్తర్వులు ఇచ్చారు. దీన్ని ఈడీ అధికారులు తీవ్రంగా పరిగణించారు. ఈడీ ప్రధాన కార్యాలయంలో కస్టడీలో ఉన్న కేజ్రీవాల్ కు తాము కంప్యూటర్ లేదా పేపర్ ను సమకూర్చలేదని ఈడీ తెలిపింది. అయినా, ఆయన ఆదేశాలు బయటకు ఎలా వెళ్లాయనే దానిపై దృష్టి సారించింది. ఇదే అంశంపై ఆయనను ప్రశ్నించే అవకాశం కూడా ఉంది. ఈ వివాదం సద్దుమణగక ముందే కేజ్రీవాల్ నుంచి రెండో సారి ఆదేశాలు రావడం ఆసక్తికరంగా మారింది.

More Telugu News