Chandrababu: నేను సీఎంగా ఉన్నంత కాలం ముస్లింలకు అన్యాయం జరగదు: చంద్రబాబు

  • రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే కేంద్ర సాయం అవసరమన్న చంద్రబాబు
  • అందుకే బీజేపీతో పొత్తు పెట్టుకున్నామని వివరణ
  • ముస్లింల హక్కులకు భంగం కలిగే చర్యలు తాము ఏనాడూ తీసుకోలేదని వెల్లడి
Chandrababu assures well being for Muslims

టీడీపీ అధినేత చంద్రబాబు నేడు సొంత నియోజకవర్గం కుప్పంలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. రంజాన్ మాసం నేపథ్యంలో... కుప్పంలోని కేవీఆర్ కల్యాణమండపంలో ముస్లిం సోదరులతో కలిసి ప్రత్యేక ప్రార్థనల అనంతరం ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో ముస్లింల భద్రతకు తాను బాధ్యత తీసుకుంటానని అన్నారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే కేంద్ర సాయం అవసరం అని, పొత్తు వల్ల రాష్ట్రానికి మేలు జరుగుతుందని అన్నారు. ముస్లింల హక్కులకు భంగం కలిగే చర్యలను తాము ఏనాడూ తీసుకోలేదని చంద్రబాబు స్పష్టం చేశారు. ‘

‘రంజాన్ మాసం అంతా సూర్యాస్తమయం వరకూ నీళ్లు, ఆహారం తీసుకోకుండా కఠోరమైన దీక్షను ముస్లిం సోదరులు చేపడతారు. ముస్లింలకు న్యాయం చేసిన ఏకైక పార్టీ టీడీపీ. 40 ఏళ్లుగా ముస్లింలకు ప్రాధాన్యత ఇస్తున్నాం. ఉర్దూను రెండో భాషగా చేసింది టీడీపీనే. సమైక్య రాష్ట్రంలో 13 జిల్లాల్లో ఉర్దూను రెండో భాషగా చేశాను. 

ముస్లింలో చాలా మంది పేదలు ఉన్నారని గుర్తించిన ఎన్టీఆర్ 1985లో దేశంలోనే మొదటిసారిగా కార్పొరేషన్ ఏర్పాటు చేసి నిధులు కేటాయించారు. హజ్ యాత్రకు వెళ్లాలంటే ఇబ్బందులు పడుతున్నారని... హైదరాబాద్ లో హజ్ హౌస్ కట్టి విమాన సదుపాయాన్ని కల్పించాం. రాష్ట్రం విడిపోయాక కడప, విజయవాడలో హజ్ హౌస్ ల నిర్మాణం చేపట్టి 90 శాతం పూర్తి చేశాం. కానీ వాటిని ఈ ప్రభుత్వం పూర్తి చేయలేదు. 

సమైక్య రాష్ట్రంలో ఉర్దూ యూనివర్సిటీని హైదరాబాద్ కు తెచ్చాం... విభజన తర్వాత కర్నూలుకూ తెచ్చాం. ఖురాన్ స్ఫూర్తితో పేద ముస్లింలైన 10 లక్షల మందికి రంజాన్ తోఫా ఇచ్చాం. దుకాన్ మకాన్, దుల్హన్ పథకాలను ప్రవేశపెట్టాం. 33 వేల మందికి దుల్హన్ పథకం ద్వారా రూ.165 కోట్లు ఆర్థిక సాయం ఇచ్చిన ఏకైక పార్టీ టీడీపీ. విదేశీ విద్య కింద 527 మందిని విద్యార్థులను విదేశాలకు పంపించాం. 

కానీ ఈ ప్రభుత్వం ఎవరికీ డబ్బులు ఇవ్వలేదు. ఒక్క మైనారిటీ సోదరుడికైనా ఆర్థిక సాయం అందించిందా? ఒక్క మసీదైనా కట్టారా? ఆఖరికి మరమ్మతులకు కూడా డబ్బులు ఇవ్వలేదు. నాడు నేను రూ.3 లక్షల రుణం ఇచ్చి రూ.లక్ష సబ్సీడీ ఇచ్చా. ఇమామ్, మౌజన్ లకు గౌరవ వేతనం ఇచ్చింది టీడీపీనే. కానీ 6 నెలలుగా ఈ ప్రభుత్వం గౌరవ వేతనం ఇవ్వడం లేదు. 

నంద్యాలలో అబ్దుల్ సలాం కుటుంబాన్ని వేధించడంతో ఆత్మహత్య చేసుకుంది. ఎమ్మిగనూరులో హజీరాబీ అనే ముస్లిం యువతిని కొందరు వైసీపీ గూండాలు అత్యాచారం చేసి చంపేస్తే పట్టించుకోలేదు. వి.కోటలో చదువుల తల్లి మిస్బా బాగా చదువుతుంది... కానీ వైసీపీ నేత కూతురు సెకెండ్ వస్తోందని మిస్బాకు టీసీ ఇవ్వడంతో ప్రాణాలు వదిలిపెట్టింది. ముస్లిం ఆడబిడ్డ బాగా చదువుకుంటే మనసు ఒప్పలేని దుర్మార్గులు వీళ్లు. 

కళ్యాణదుర్గంలో చాపిరి గ్రామంలో యువతిని మోసం చేసి చంపేశారు. దాచేపల్లిలో అలీషా మద్యం అమ్ముతున్నాడని నింద వేసి కొట్టి చంపేశారు. కడపలో అక్బర్ బాషాకు చెందిన భూమిని కబ్జా చేయడంతో ఆత్మహత్యకు యత్నించాడు. ముస్లిం యువకులపై పుంగనూరులో కేసులు పెట్టి 12 మందిని జైలుకు పంపారు. మసీదును కబ్జా చేస్తున్నారని పోరాడినందుకు నరసరావుపేటలో ఇబ్రహీంను నరికి చంపారు. 

రాష్ట్రంలో అసలు ప్రభుత్వం ఉందా? 45 ఏళ్ల ట్రాక్ రికార్డు ఉన్న పార్టీ టీడీపీ. ఎన్డీయేలో ఉన్నప్పుడు కూడా గతంలో ముస్లింల హక్కులకు భంగం కలిగే చర్యలు ఏనాడూ చేయలేదు. మీ పిల్లల అభివృద్ధి కోసం కృషి చేశాం. పార్లమెంట్ లో అన్ని చట్టాలకు వైసీపీ ముందుండి మద్దతు ఇచ్చింది. రాష్ట్రంలో రాక్షస ప్రభుత్వం ఉంది. అందరిపై దాడులు చేస్తున్నారు. 

అందుకే నేను, పవన్ ఆలోచించి బీజేపీ ముందుకు రావడంతో పొత్తు పెట్టుకున్నాం. ముస్లింలకూ పనులు కావాలన్నా... అభివృద్ధి చెందాలన్నా కేంద్ర ప్రభుత్వ సాయం కావాలి... అందుకే పొత్తు పెట్టుకున్నాం తప్ప మరో కారణం కాదు. 3 పార్టీలు రాష్ట్ర భవిష్యత్తు కోసమే పొత్తు పెట్టుకున్నాయి. నేను సీఎంగా ఉన్నంత కాలం మీకు అన్యాయం జరగదు. దుర్మార్గ ప్రభుత్వం వస్తే మీకూ భవిష్యత్తు ఉండదు. ముస్లింలు, క్రిస్టియన్లు కూడా ఇబ్బందులు పడే పరిస్థితి వస్తుంది. 

అందరినీ సమానంగా చూసి, అందరికీ సంక్షేమాన్ని అందించే ఏకైక పార్టీ టీడీపీ. ప్రతి ఒక్కరికీ న్యాయం జరగలాన్నదే నా తపన. ముస్లింలకు ఏం కావాలన్నా నేను ముందుంటా. ముస్లిం సోదరులు ఏదీ మనుసులో పెట్టుకోకుండా ముందుకు రావాలి. ముస్లింల భద్రతకు నాది బాధ్యత’’ అని చంద్రబాబు స్పష్టం చేశారు.

More Telugu News