Sajjanar: డ్రగ్‌ పార్శిళ్ల పేరుతో వచ్చే ఫోన్‌ కాల్స్‌‌కు స్పందించవద్దు.. టీఎస్‌ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ హెచ్చరిక

  • సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారని అప్రమత్తం చేసిన టీఎస్‌ఆర్టీసీ ఎండీ
  • ఈ తరహా మోసాలకు గురైతే సైబర్‌క్రైమ్‌ హెల్ప్‌లైన్‌ 1930కి ఫిర్యాదు చేయాలని సూచన
  • ఇటీవల ఐఐటీ హైదరాబాద్ పీహెచ్‌డీ స్కాలర్‌ నుంచి రూ.30 లక్షలు దోచేశారని వెల్లడి
Phone calls in the name of drug parcels IPS Sajjanar alerts people

డ్రగ్స్‌ పార్శిళ్లు వచ్చాయంటూ పోలీసుల మాదిరిగా ఫోన్ కాల్స్ చేసి సైబర్‌ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్న నేపథ్యంలో ఆర్టీసీ ఎండీ సజ్జనార్ పలు కీలక సూచనలు చేశారు. డ్రగ్స్ పార్శిళ్లు వచ్చాయంటూ ఎవరైనా ఫోన్‌ కాల్స్‌ లేదా ఐవీఆర్‌ కాల్స్‌ చేస్తే స్పందించవద్దని హెచ్చరించారు. ఈ తరహాలో మోసాలకు గురైతే సైబర్‌క్రైమ్‌ హెల్ప్‌లైన్‌ 1930కి ఫిర్యాదు చేయాలని సజ్జనార్ సూచించారు. పలువురు బాధితులు తనను వ్యక్తిగతంగా కలిసి మోసపోయామని ఆవేదన వ్యక్తం చేశారని, అందుకే ఇలాంటి ఘటనల విషయంలో అప్రమత్తంగా ఉండాల్సిన ఉన్నత విద్యావంతులు కూడా మోసపోవడం బాధాకరమని సజ్జనార్ విచారం వ్యక్తం చేశారు.

ఈ తరహాలో ఇటీవల ఐఐటీ హైదరాబాద్‌ పీహెచ్‌డీ స్కాలర్‌ ఒకరికి ఫోన్‌ కాల్‌ చేసి రూ.30 లక్షలు దోచేశారని సజ్జనార్ వెల్లడించారు. ఉగ్రవాద స్లీపర్‌ సెల్స్‌తో కుటుంబానికి ప్రాణహాని ఉందని స్కాలర్‌ని నమ్మించారని, హౌజ్‌ అరెస్ట్‌ చేస్తున్నామంటూ చెప్పి 6 రోజులు ఇంట్లోంచి బయటకు రాకుండా చేశారని, చివరికి ఇదంతా మోసమని తెలుసుకొని పోలీసులకు ఫిర్యాదు చేశారని సజ్జనార్ వివరించారు. సైబర్‌ నేరగాళ్లు పోలీసుల పేరుతో కాల్స్‌ చేస్తూ డ్రగ్స్‌, తీవ్రవాదులతో బ్యాంక్‌ లావాదేవీలు చేశారంటూ బెదిరించి కోట్ల రూపాయల మేర కుచ్చుటోపీ పెడుతున్నారని ఆయన హెచ్చరించారు.

More Telugu News