IPL-2024: ఐపీఎల్: గెలుపు బోణీ కొట్టిన రాజస్థాన్ రాయల్స్

  • లక్నోపై 20 పరుగుల తేడాతో గెలిచిన రాజస్థాన్
  • 194 పరుగుల లక్ష్యఛేదనలో 173 పరుగులే చేసిన లక్నో
  • రెండో మ్యాచ్ లో టాస్ గెలిచిన ముంబయి ఇండియన్స్
Rajasthan Royals starts IPL campaign with winning note

ఐపీఎల్ తాజా సీజన్ లో రాజస్థాన్ రాయల్స్ గెలుపుతో తన ప్రస్థానాన్ని  ప్రారంభించింది. ఇవాళ సొంతగడ్డ జైపూర్ లో లక్నో సూపర్ జెయింట్స్ తో జరిగిన మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ 20 పరుగుల తేడాతో విజయం సాధించింది. 

ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన రాజస్థాన్ తొలుత నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 193 పరుగులు చేయగా, లక్ష్యఛేదనలో లక్నో జట్టు 20 ఓవర్లలో 6 వికెట్లకు 173 పరుగులే చేసి ఓటమిపాలైంది. లక్నో ఇన్నింగ్స్ లో కెప్టెన్ కేఎల్ రాహుల్ 58, నికోలస్ పూరన్ 64, దీపక్ హుడా 26 పరుగులు చేశారు. 

క్వింటన్ డికాక్ (4), దేవదత్ పడిక్కల్ (0), ఆయుష్ బదోనీ (1), మార్కస్ స్టొయినిస్ (3) తీవ్రంగా నిరాశపరిచారు. రాజస్థాన్ రాయల్స్ బౌలర్లలో ట్రెంట్ బౌల్ట్ 2, నాండ్రే బర్గర్ 1, రవిచంద్రన్ అశ్విన్ 1, చహల్ 1, సందీప్ శర్మ 1 వికెట్ తీశారు.

గుజరాత్ పై టాస్ గెలిచిన ముంబయి ఇండియన్స్

ఇవాళ జరుగుతున్న రెండో మ్యాచ్ లో గుజరాత్ ఇండియన్స్, ముంబయి ఇండియన్స్ తలపడుతున్నాయి. ఈ మ్యాచ్ కు అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదిక. టాస్ గెలిచిన ముంబయి ఇండియన్స్ బౌలింగ్ ఎంచుకుంది.

More Telugu News