Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసు: ఇద్దరు పోలీసు అధికారులకు రిమాండ్

  • తెలంగాణలో తీవ్ర దుమారం రేపుతున్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం
  • డీసీపీ తిరుపతన్న, అదనపు ఎస్పీ భుజంగరావు అరెస్ట్
  • నేడు వీరిద్దరినీ కోర్టులో హాజరుపరిచిన పోలీసులు
  • 14 రోజుల రిమాండ్ విధించిన న్యాయమూర్తి
Remand for two police officers in Phone Tapping case

తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం మరో ఇద్దరు పోలీసుల అధికారుల మెడకు చుట్టుకుంది. హైదరాబాద్ అడిషనల్ డీసీపీ తిరుపతన్న, భూపాలపల్లి అడిషనల్ ఎస్పీ భుజంగరావులను ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పటికే అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా, వీరిద్దరినీ ఇవాళ కోర్టులో హాజరుపర్చగా, ఇద్దరికీ 14 రోజుల రిమాండ్ విధించారు. 

ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో పాత్రధారులైన ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు, హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావు, ఐన్యూస్ మీడియా సంస్థ నిర్వాహకుడు అరువెల శ్రవణ్ రావు దేశం విడిచి వెళ్లారు. వీరిపై ప్రస్తుతం లుకౌట్ నోటీసులు అమల్లో ఉన్నాయి. 

ఇటీవల ఎస్ఐబీలో ఆధారాల ధ్వంసం కేసులో డీఎస్పీ ప్రణీత్ రావును విచారించిన నేపథ్యంలో ఫోన్ ట్యాపింగ్ అంశం తెరపైకి రాగా, ఈ వ్యవహారం తెలంగాణలో తీవ్ర దుమారం రేపుతోంది. 

ఎన్నికలు, ఉప ఎన్నికలు జరిగిన సమయంలో విపక్షాలకు చెందిన కీలక నేతల ఫోన్లను ట్యాపింగ్ చేసినట్టు ప్రణీత్ రావు వాంగ్మూలం ద్వారా వెల్లడైంది. ఈ ట్యాపింగ్ వ్యవహారం అంతా అప్పటి ఎస్ఐబీ చీఫ్ ప్రభాకర్ రావు నేతృత్వంలో సాగినట్టు గుర్తించారు.

More Telugu News